TDP Rajya Sabha Seat: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. ఈనెల 8 తో నామినేషన్ల గడువు ముగియనుంది. మరో రెండు రోజులపాటు మాత్రమే గడువు ఉంది. దీంతో కూటమి తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది. అయితే ఈసారి బిజెపికి అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరికి రాజ్యసభ పదవి దక్కుతుంది. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది కత్తి మీద సాములా మారింది. ఇద్దరు అభ్యర్థుల ఎంపికలో స్పష్టత వచ్చింది. మరోసారి టిడిపి నుంచి సానా సతీష్ కు ఛాన్స్ ఖాయం. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ప్రకటించేశారు.
* రెండు పదవులు కొలిక్కి..
తెలుగుదేశం పార్టీ రెండు పదవులకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. అందులో విద్యావేత్త భాష్యం రామకృష్ణ పేరు దాదాపు ఖరారు చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా భాష్యం రామకృష్ణ సేవలందిస్తూ వచ్చారు. అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చివరి నిమిషంలో చేర్పులు మార్పులు తప్పిస్తే ఆయనకు రాజ్యసభ పదవి ఖరారు చేస్తారని తెలుస్తోంది. లోకేష్ కు అత్యంత విధేయుడుగా ఉంటూ వచ్చారు భాష్యం రామకృష్ణ. అందుకే ఈసారి ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
* సామాజిక సమీకరణలు..
మరోవైపు టిడిపి కి లభించే మూడో రాజ్యసభ పదవిపై బలమైన చర్చ నడుస్తోంది. అనూహ్య అభ్యర్థిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. బీసీ మహిళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు బీసీ పురుషుల కోటాలో చింతకాయల విజయ్ పేరు వినిపిస్తోంది. ఇక ఎస్సీలకు ఇవ్వదలచుకుంటే వర్ల రామయ్యకు ఖరారు చేయనున్నారు. ప్రతిసారి వర్ల రామయ్యకు మొండి చేయి చూస్తూ వచ్చారు. సీనియారిటీతోపాటు సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకొని రామయ్యను ఫైనల్ చేస్తారని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విజయ్ కు భవిష్యత్తులో మంచి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా బీసీ మహిళను తెరపై తెచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నాయి టిడిపి వర్గాలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
