Putta Mahesh Kumar Yadav drug case: తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది డ్రగ్స్ కేసు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో చాలామంది పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ బృందంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ దూరం పెట్టింది. షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటనపై స్పందించారు మహేష్ కుమార్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్. మహేష్ కు సర్జరీ జరిగిందని.. అటువంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100% ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. కేసు విచారణ తర్వాత ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని వివరించారు.
టిడిపి హై కమాండ్ నోటీసులు..
తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో తెలుగుదేశం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడడం సంచలనగా మారింది. టిడిపి హై కమాండ్ దీనిపై స్పందించింది. సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మహేష్ కుమార్ హై కమాండ్ కు వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, మైదకూరు టిడిపి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ స్పందించారు. 2021 లోనే మహేష్ కు హార్ట్ ఆపరేషన్ జరిగిందని.. అప్పటినుంచి డాక్టర్లు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన కుమారుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటాడని కూడా ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో మహేష్ కుమార్ కు కొన్ని రకాల టెస్టులు చేయించామని.. అన్నింటా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని చెప్పారు. టిడిపి హాయ్ కమాండ్కు అన్ని విషయాలు వివరించామని చెప్పుకొచ్చారు.
కారు లేకపోవడంతోనే ఉండిపోయాడు..
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పార్టీ ఉందని చెప్పడంతోనే తన కుమారుడు అక్కడకు వెళ్లారని వివరించారు సుధాకర్ యాదవ్. అక్కడ పరిస్థితులు చూశాక వచ్చేస్తానని సిద్ధపడగా కారు లేకుండా పోయిందని.. అందుకే అక్కడ ఉండిపోయారని వివరించారు. అసలు మహేష్ టెస్ట్ కోసం బ్లడ్ తీసుకోకుండా పాజిటివ్ ఎలా వస్తుందని కూడా ప్రశ్నించారు. 48 గంటల తరువాతే రిపోర్టు వస్తుందని.. అలాంటిది కొన్ని గంటల వ్యవధిలోనే బ్లడ్ రిపోర్ట్ ఎలా వచ్చింది అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే కేసు విచారణ పూర్తయిన తర్వాత అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని చెప్పారు సుధాకర్ యాదవ్. కాగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి గతంలో టీటీడీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వయానా మామ. ఈ నేపథ్యం ఉన్న పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం మాత్రం సంచలనంగా మారింది.