Pithapuram Varma Frustration: పిఠాపురం( Pithapuram) వర్మ లో ఇటీవల అసహనం పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం హాట్ టాపిక్ అయింది. అక్కడ నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఆయన కోసం సీటు త్యాగం చేసిన టిడిపి ఇన్చార్జ్ వర్మకు మాత్రం ఎటువంటి పదవి రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆయనకు పదవి ఇస్తారని హడావిడి నడిచింది. కానీ రెండేళ్లు పూర్తవుతున్న ఆయనకు పదవి దక్కలేదు. రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ ఖాళీలు వచ్చినప్పుడు తెగ హడావిడి నడుస్తుంటుంది. చివరకు వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ లేకుండా పోతోంది. అయితే తనకు పదవి రాకపోవడానికి జనసేన తో పాటు పవన్ కళ్యాణ్ కారణం అన్న అనుమానం వర్మలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఎక్కువగా ఫ్రస్టేషన్ తో ఉన్నారు. తాజాగా ఓ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో చిన్నది చేసి పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది పెట్టారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోయారు.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
* బలమైన నాయకుడు..
పిఠాపురంలో వర్మ బలమైన నాయకుడు. గతంలో ఓసారి పార్టీ టికెట్ రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బలమైన నియోజకవర్గంగా మార్చారు వర్మ. అయితే రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తో టిడిపికి పొత్తు అవసరం. గత అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కు ఒక నియోజకవర్గం అవసరం వచ్చింది. అంతకుముందు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో 2024లో జాగ్రత్త పడ్డారు. అలా పిఠాపురం పై దృష్టి పడడంతో వర్మను సైడ్ చేయాల్సి వచ్చింది. బలమైన నాయకుడు కావడంతో ఆయన సాయం తీసుకోవాలని భావించి ప్రాధాన్యమిచ్చారు వర్మకు.. అయితే బలమైన హామీతోనే అప్పట్లో వర్మ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం ఉంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రోజురోజుకు వర్మలో అసహనం పెరుగుతోంది. టిడిపి నాయకత్వం సైతం వర్మ విషయంలో నిస్సహాయతతో ఉంది.
* మారిన పరిస్థితులు..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వర్మ కు ఎటువంటి నామినేటెడ్ పదవి( nominated post) దక్కలేదు. ఆపై పిఠాపురం నియోజకవర్గంలో అధికార పార్టీగా సరైన గౌరవం దక్కడం లేదు. ఈ తరుణంలో పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి అన్నట్టు పరిస్థితి మారింది. రాష్ట్రస్థాయిలో పొత్తు ఉండడం.. పవన్ కీలకంగా ఉండడం.. ఆయనకు కాదని వర్మకు పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో రోజురోజుకు పరిస్థితి శృతిమించుతోంది. అయితే పిఠాపురంలో తనకే కాదు చంద్రబాబుకు కూడా విలువ లేదని చెప్పేందుకే వర్మ అలా చేసి ఉంటారన్న టాక్ కూడా పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇప్పటికే పిఠాపురం అనేసరికి రకరకాల వివాదం నడుస్తూనే ఉంటుంది. ఒకానొక దశలో వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కూడా ప్రచారం నడిచింది. పార్టీ కోసం కష్టపడిన తాను ఎందుకు గుడ్ బై చెబుతానని వర్మ ప్రశ్నించారు కూడా. అయితే తన ఆవేదనంత పార్టీ కోసమే అన్నట్టు ఇప్పుడు వర్మ ప్రవర్తన ఉంది. దీనిపై టిడిపి నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
