Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చెట్లంటే చాలా ఇష్టం. పచ్చని ప్రకృతి అంటే విపరీతమైన మమకారం. అందువల్లే ఆయన ఏరి కోరి పర్యావరణ శాఖ తీసుకున్నారు. ఆయన ఆ శాఖ తీసుకున్న తర్వాత ఏపీలో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతున్నాయి.
చిత్తూరులో ఎర్రచందనం అక్రమ రవాణాకు ఆయన అడ్డుకట్ట వేశారు. అక్కడితోనే ఆగిపోలేదు .. అడవి జంతువుల కోసం వేటగాళ్లు పెడుతున్న ఉచ్చులను తొలగించి వేశారు. అటవీ శాఖ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించారు. మొక్కల పెంపకాన్ని ఆయన యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే మొక్క నాటుతూ పర్యావరణం మీద తనకు ఉన్న మమకారాన్ని చాటుకుంటున్నారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరాలు ఘనంగా నిర్వహించడానికి మరో 100 కోట్లను పవన్ కళ్యాణ్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరితే.. ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఆ మధ్య కాకినాడలో జరుగుతున్న పారిశ్రామిక కాలుష్యానికి అడ్డు కట్ట వేయడానికి ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇందులో విజయం కూడా సాధించారు. ఇక రాజమండ్రిలో గోదావరి నదిలోకి ఆంధ్ర పేపర్ మిల్ విష పదార్థాలను డంపు చేస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా గుర్తించారు. అనేక సందర్భాలలో ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం వ్యవహార శైలిని తీవ్రంగా తప్పు పట్టారు. కాలుష్య నివారణకు మార్గాలు సూచించినప్పటికీ ఆ పేపర్ మిల్ పట్టించుకోవడం లేదు. అందువల్లే ఆ పేపర్ యాజమాన్యం తీరును ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజమండ్రిలో ఉదాహరణకు ప్రతి 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్ధాలు వస్తుంటాయి.. అందులో 35 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్ధాలు ఆంధ్ర పేపర్ మిల్ నుంచే వస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చివరికి 2016 నుంచి స్థానిక పంచాయతీకి ఆంధ్ర పేపర్ మిల్ పన్నులు కూడా కట్టడం లేదు. అవి ఇప్పుడు ఏకంగా 21 కోట్లకు చేరుకున్నాయి. వాటిని చెల్లించాలని కోరితే ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం కోర్టుకు వెళ్తోంది. కోర్టుల నుంచి వెసలు బాట్లను తీసుకొస్తున్నది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ప్రెస్ నోట్ రూపంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి పర్యావరణం మాత్రమే కాకుండా.. కాలుష్య నివారణ కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. కానీ ఆయన తన ఆవేదనను లేఖల రూపంలో బయటపెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవసరమైతే ఆ ఫ్యాక్టరీని మూసి వేసే సామర్థ్యం పవన్ కళ్యాణ్ కి ఉంది. అయినప్పటికీ ఆయన లేఖలు రాయడం.. చర్యలు తీసుకోవాలని ఏజీ స్థాయి అధికారులతో మాట్లాడడం.. ఇలా అనేక పర్యాయాలు జరగడం వెనక.. ఏదో మతలబు ఉందని వార్తలు వస్తున్నాయి.
ఆంధ్ర పేపర్ మిల్ నుంచి వస్తున్న ద్రవ వ్యర్ధాలను పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రాంతంలో విస్తారంగా పెరిగిన గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన చెప్పినట్టుగానే అధికారులు ఆ పని చేశారు. కానీ ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి వస్తున్న ద్రవ వ్యర్థాలను నిలుపుదల చేయలేకపోయారు. ఇప్పటికీ ఆ వ్యర్ధాలు వస్తుండడంతో జలాలు కలుషితంగా మారిపోతున్నాయి. ఇదే తీరుగా ఆ వ్యర్థ పదార్థాలు వస్తుంటే గోదావరి మరింత దారుణంగా కాలుష్య కాసారంగా మారే ప్రమాదం ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ పరపతి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కూటమి ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి ఎదురుకోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.