East Godavari : ఆమెది ఏడు పదుల వయసు. కంటి చూపు సరిగా లేదు. టీ చేసే క్రమంలో టీ పౌడర్ బదులు..పొరపాటున పురుగుల మందు వేసింది.అలా తయారు చేసిన ఆ టీని వృద్ధ దంపతులు తాగారు. బలవర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది ఈ విషాద ఘటన. రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో వెలుచూరి గోవింద్(75),అప్పయమ్మ (70)అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. అప్పయమ్మకు సరిగ్గా కళ్ళు కనిపించవు. ఆమెశనివారం టీ చేసే ప్రయత్నం చేసింది.ఈ క్రమంలో టీ పౌడర్ బదులు పురుగుల మందు ప్యాకెట్ లో పౌడర్ ను వినియోగించింది. అలా తయారు చేసిన టీ తాగిన ఆ వృద్ధ దంపతులు నోటి నుంచి నురగలు కక్కుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* ఒంటరిగా నివాసం
ఈ వృద్ధ దంపతులకు నలుగురు సంతానం.అందులో కుమారుడు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లో వాచ్ మాన్ గా పనిచేస్తున్నారు. అక్కడ దుస్తులు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో వృద్ధ దంపతులు ఒంటరిగానే గ్రామంలో నివసిస్తున్నారు. ఊర్లో కుమార్తె వీరికి అండగా ఉంటూ వస్తుంది. శనివారం కుమార్తె లేకపోవడంతో ఆ వృద్ధురాలు టీ చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
* కోతి విడిచి పెట్టిన వైనం
అయితే ఇటీవల ఒక కోతి పురుగు మందుల పొడితో ఉన్న ప్యాకెట్ను తీసుకొచ్చి ఇంటి ఆవరణలో పడేసింది. అది టీ పొడిగా భావించిఇంట్లో పెట్టారు.దానితోనే టీ చేసి విషాదాంతం పొందారు. తొలుత ఎందుకు అస్వస్థతకు గురయ్యారో తెలియని పరిస్థితి. టీ తాగడం తర్వాత నురగలు కొట్టుకోవడంతో స్థానికులు ఇంట్లో పరిశీలించగా.. టీ పొడి బదులు పురుగుమందుల పొడి వేసినట్లు గుర్తించారు.తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రిలో చేర్పించారు.వైద్యులు ఎంత ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు.
* ఎంతో అన్యోన్యంగా
ఆ వృద్ధులది అన్యోన్య దాంపత్యం.ఎంతో కలివిడిగా ఉండేవారు.వారిని చూసి విధికి కన్ను కొట్టిందేమో.. ఇలా పురుగుమందుల రూపంలో కబలించింది.ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More