MVS Murthy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలామంది నేతలు దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఓటమి తర్వాత ఒక్కొక్కరు గుడ్ బై చెప్పారు. అయితే అవకాశం లేని వారు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ పెద్దగా క్రియాశీలకం కావడం లేదు. అటువంటి నేతల్లో విశాఖ మాజీ ఎంపీ ఎం వి ఎస్ మూర్తి ఒకరు. మొన్నటి ఎన్నికల్లో ఆయన విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దారుణంగా ఓడిపోయారు. ఓడిన తర్వాత ఆయన పార్టీకి పెద్దగా పట్టించుకోలేదు. తన దారి తాను చూసుకున్న మాదిరిగా తయారయ్యారు. అయితే ఇటీవల మనసు మార్చుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మొన్న విశాఖలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. అధినేత కంటపడేందుకు ఎంవీఎస్ మూర్తి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే జగన్ పట్టించుకోకపోయేసరికి ఆ వివాహ వేడుకల నుంచి మధ్యలోనే వెళ్లిపోయినట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ఏపీలో డిఎల్ఎఫ్.. పెద్ద ప్లాన్లు ఇవి
* నిర్మాణరంగం నుంచి..
ఎం వి ఎస్ మూర్తి( MVS Murthy ) ఒక బిల్డర్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మూర్తి 2019 ఎన్నికలకు ముందు పరిస్థితి చూశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. పైగా ఆ ఎన్నికల్లో అక్కడ నుంచి గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ పోటీ చేశారు. అదే సామాజిక వర్గానికి చెందడం, ఆర్థికంగా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో మూర్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలా ఆ ఎన్నికల్లో గెలిచారు మూర్తి. ఎంపీ కావడంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నారు. బాగానే వృద్ధిలోకి వచ్చారు.
* అప్పట్లో ఎన్నో అవమానాలు..
అయితే ఉత్తరాంధ్ర విషయంలో అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉండేది. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలకు విజయసాయిరెడ్డి అడ్డు వస్తున్నారు అనేది అప్పట్లో ఎం వి ఎస్ మూర్తి చేసే ఆరోపణ. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం కిడ్నాప్ నకు గురయ్యారు. అధికార పార్టీ ఎంపీగా ఉంటూనే తనకు జరిగిన పరిస్థితిని అవమానంగా భావించారు మూర్తి. అయితే ఎలాగోలా ఆ వివాదం సమసిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఎం వి ఎస్ మూర్తిని విశాఖ తూర్పు అసెంబ్లీ కి షిఫ్ట్ చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించాలని భావించారు. అయితే మూర్తి ఓడిపోయేసరికి ఎన్నికల తర్వాత పెద్దగా ఆసక్తి చూపలేదు. దాదాపు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతారన్న ప్రచారం నడిచింది. కానీ కూటమి పార్టీలు ఆయనను తీసుకోలేదు. దీంతో పార్టీలో తిరిగి యాక్టివ్ కావాలని భావిస్తున్నారు మూర్తి. అయితే జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే మొన్న వివాహ వేడుకల్లో మాత్రం మాజీ ఎంపీ కి అవమానం జరిగింది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.