Jagan: జాతీయస్థాయిలో ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు(AP Elections 2024) జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య గట్టి వార్ ఉంది. అందుకే జాతీయస్థాయిలో ఇక్కడ ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వైసిపి(YCP), టిడిపి(TDP), జనసేనలకు(Janasena) ఎనలేని ప్రాధాన్యం ఉంది.అయితే ఏపీలో తామే అధికారంలోకి వస్తామని అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి బలంగా విశ్వసిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ అయితే 151 స్థానాలు కంటే అధికంగా వస్తాయని.. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 22 కు పైగా దక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు.
గత ఎన్నికల తర్వాత బిజెపికి దగ్గరయ్యారు జగన్. ఎన్డీఏ(NDA) లో చేరలేదు కానీ అంతకుమించి అన్నట్టు వ్యవహరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు బిజెపికి జగన్ బాగా దగ్గరయ్యారు. రాజ్యసభలో బిజెపికి ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో.. అవసరమైన సార్లు అండగా నిలిచారు. అటు కేంద్రం సైతం జగన్ కు అన్ని విధాలా సహకారం అందిస్తూ వచ్చింది. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు బిజెపి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టిడిపి కూటమిలో చేరింది. అటు టిడిపిని ఎన్డీఏలో చేర్చుకుంది. ఈ పరిణామాలతో జగన్ షాక్ కు గురయ్యారు.
అయితే జగన్ జాతీయస్థాయిలో ఎటువంటి స్టాండ్ తీసుకుంటారా అని రకరకాల చర్చ నడుస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి.. మెజారిటీ పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటే జగన్ కీలకంగా మారనున్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అవసరమైన మెజారిటీ దక్కకపోవచ్చు అన్నది ఒక అంచనా. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి గణనీయంగా బలం పుంజుకుందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో జగన్ ఎవరి పక్షాన నిలబడతారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని.. ఆ పార్టీ నుంచి బయటపడి వైసిపిని స్థాపించారు జగన్. చంద్రబాబు దూరం కావడంతో బిజెపికి దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు అదే బిజెపి తనను కాదని టిడిపి చెంతకు వెళ్లడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ కు ఒక ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమికి మద్దతు తెలిపితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు ఒకరు జగన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం ఒక షరతు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టమైన ప్రకటన తర్వాతే పునరాలోచిస్తానని.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటానని జగన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఇప్పుడు ఏపీ కేంద్రంగా జాతీయ రాజకీయాలు మలుపు తిరుగుతుండడం గమనార్హం.
Hyderabad Joint Capital: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని డిమాండ్ ఎవరి కోసం?
AP Elections 2024: ఏపీలో సేమ్ సీన్.. నాడు టిడిపి, నేడు వైసిపి
