Mahanadu 2026 venue change: తెలుగుదేశం పార్టీకి వార్షిక పండుగ మహానాడు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన జయంతి నాడు ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా నెల్లూరులో ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం పొదుపు సూచనల నేపథ్యంలో ఖర్చు తగ్గించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పరిస్థితిల్లో అట్టహాసంగా మహానాడు నిర్వహించడం అనేది తప్పుడు సంకేతంగా వెళుతుందని టిడిపి హై కమాండ్ భావించింది. అందుకే హైబ్రిడ్ విధానంలో మహానాడు ను నిర్వహించాలని నిర్ణయించింది. వర్చువల్ విధానంలోనే మహానాడు జరగనుంది ఈ ఏడాది. మంగళగిరిలో టిడిపి కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో మహానాడు కొనసాగనుంది. జిల్లాల్లో నాయకులు పాల్గొనున్నారు. క్లస్టర్ స్థాయిలో కార్యకర్తలు హాజరవుతారు. వర్చువల్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది టిడిపి నాయకత్వం.
నెల్లూరులో ఏర్పాట్లు..
తొలుత శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణకు మొగ్గుచూపింది టిడిపి హై కమాండ్. మహానాడు వేదిక కోసం స్థలాల పరిశీలన కూడా జరిగింది. కానీ త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. దీంతో అప్పట్లో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటన ఉండగా ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చిన టిడిపి నాయకత్వం… మహానాడు ను నెల్లూరు జిల్లాకు తరలించింది. దాదాపు రెండు వేల ఎకరాల్లో మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. కానీ మొన్న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో 8 రకాల పొదుపు అంశాలపై పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దుబారా ఖర్చు తగ్గించేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు తమ కాన్వాయ్ లో వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా మహానాడులో ఖర్చు తగ్గించుకోవాలని చూసి ఈ నిర్ణయానికి వచ్చారు.
పరిమిత సంఖ్యలో నేతలకు..
తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో విభాగం పెద్దది. అందుకే ఆ విభాగం సభ్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర విభాగం ప్రతినిధులు, ఆపై అధికార ప్రతినిధుల కు మాత్రమే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ విధానంలో మహానాడు ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1800కు పైగా ఉన్న క్లస్టర్ల పరిధిలో కార్యకర్తలు వర్చువల్ విధానంలో మహానాడులో పాల్గొనే వీలుగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు ఇలా హైబ్రిడ్ విధానంలోకి మార్చడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది.
