Lingamaneni Ramesh: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. ఈ ఏడాది జూన్లో నలుగురు సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే అందులో ఇద్దరు సభ్యులకు మరోసారి రెన్యువల్ కొనసాగనుంది. మిగతా ఇద్దరు సభ్యుల విషయంలో టిడిపి, జనసేన చెరో సీటు దక్కించుకుంటాయన్న ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ఎక్కువ. ఆ పార్టీ విషయాన్ని పక్కన పెడితే జనసేనలో రాజ్యసభ పదవి ఎవరికి ఇస్తారు అన్న టాక్ అయితే పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. నిన్నటి వరకు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరికి రాజ్యసభ పదవి ఖాయం చేస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే ఆ ఇద్దరూ పవన్ కళ్యాణ్ కు సన్నిహితులు. దీంతో జనసేన అధినేత ఆలోచన ఎలా ఉంటుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.
* నలుగురి పదవీ విరమణ..
ఏపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి( Aalha Ayodhya Ram Reddy ), పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, సనా సతీష్ రాజ్యసభ పదవుల నుంచి పదవీ విరమణ చేయనున్నారు. జూన్ తో వీరి పదవీకాలం ముగియనుంది. అయితే అయోధ్య రామిరెడ్డి, బోస్, నత్వాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన వారే. సానా సతీష్ మాత్రం ఏడాదిన్నర కిందట టిడిపి నుంచి ప్రమోట్ అయ్యారు. అయితే నత్వాని పారిశ్రామిక వర్గాల నుంచి అప్పటి బిజెపి కోరిక మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇప్పుడు కూడా బిజెపి అడిగితే ఆయనకు మరోసారి టిడిపి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సానా సతీష్ సైతం మరోసారి రెన్యువల్ కానున్నారు. మిగతా రెండు రాజ్యసభ పదవుల్లో.. ఒకటి టిడిపి, మరో పదవిని జనసేన సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే జనసేన నుంచి ఎవరిని అవకాశం కల్పిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న.
* ఆర్థికంగా అండ..
ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది జనసేన( janasena) పార్టీ. ఆ సమయంలో పారిశ్రామికవేత్తగా ఉన్న లింగమనేని రమేష్ ఆర్థికంగా ఆదుకున్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా జనసేన విజయానికి పరోక్ష సహకారం అందించారు. అందుకే లింగమనేని రమేష్ కు రాజ్యసభ పదవి జనసేన తరఫున ఇస్తారని తెలుస్తోంది. ఆయన చంద్రబాబుకు సైతం అత్యంత సన్నిహితుడు. అందుకే టిడిపి నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చు. మరోవైపు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ పదవి ఆఫర్ చేసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. ఇప్పుడు రాజ్యసభ పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అయితే టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే లింగమనేని రమేష్ కు లైన్ క్లియర్ కావడం ఖాయం.