Nara Lokesh Challenge: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. డీఎస్సీపై ఎలాగైనా బురద జల్లాలన్న ప్రయత్నంలో ఉంది ఆ పార్టీ. అందుకుగాను ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తూనే ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఆధారాలతో సహా వివరణ ఇస్తుంటే.. అదే పనిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ అసలు ఉద్దేశం బయటపడుతోంది. నిన్ననే డీఎస్సీ పై సవాల్ చేశారు మంత్రి నారా లోకేష్. నీకు 200 మీటర్ల దూరంలో ఉన్నాను. చర్చకు రా డీఎస్సీ పైన అంటూ సవాల్ చేశారు. అయితే ఇక్కడ సరికొత్త ఆలోచన చేశారు జగన్. తన బదులు నందమూరి లక్ష్మీపార్వతి, యాంకర్ శ్యామలను పంపించారు. వారు వచ్చి నారా లోకేష్ కు సవాల్ చేశారు. అసలు నారా లోకేష్ చేసింది ఏంటి? లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామలకు తెలిసింది ఏంటి? అనేది తెలియదు కానీ.. ఈ అంశంపై రచ్చ మాత్రం కొనసాగేలా చేశారు జగన్. చివరకు డీఎస్సీ లో అక్రమాలు జరగలేదని స్వయంగా ఆ శాఖ ఉన్నతాధికారులు వివరణాత్మక ప్రయత్నాలు చేశారు. సాక్షిలో వచ్చిన కథనాలను, కేస్ స్టడీ లపై కూడా నివృత్తి చేశారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంతృప్తి కనిపించలేదు. మహిళా నేతలను సైతం ఈ రచ్చ లోకి దింపారు అంటే వారు ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతోంది.
* జగన్ అదే పనిగా విమర్శలు..
కొంతమంది డీఎస్సీ అభ్యర్థులను పక్కలో పెట్టుకొని ప్రభుత్వం పై విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. వారికి ర్యాంకులు వచ్చాయి కానీ ఉద్యోగాలు దక్కలేదని ఆక్షేపించారు. డీఎస్సీ నియామకాలు అడుగడుగునా అవినీతి జరిగింది అనేది జగన్ ఆరోపణ. ఆయనే కాదు కింది స్థాయి నేతల వరకు ఇదే ఆరోపణలు చేస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. అదేపనిగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. పోనీ ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు కదా.. అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయవచ్చు కదా.. అంటే మాత్రం అటువంటి ప్రయత్నం లేదు. పారదర్శకంగా చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్న పెడచెవిన పెడుతూనే ఉన్నారు. చివరకు కమ్మ డీఎస్సీ అంటూ.. స్పోర్ట్స్ కోటా కింద ఆ సామాజిక వర్గానికి ఎక్కువగా ఉద్యోగాలు కేటాయించారు అంటూ హడావిడి చేశారు. అయితే ఓపెన్ క్యాటగిరి కింద కాపులకు 16, రెడ్డి సామాజిక వర్గానికి 10, కమ్మ సామాజిక వర్గానికి 9 పోస్టులు కేటాయించామని చెప్పడంతో తోక ముడిచారు.
* రచ్చ కే ప్రాధాన్యం..
డీఎస్సీ అక్రమాలపై ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు నారా లోకేష్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామలను హడావిడిగా హైదరాబాదు నుంచి రప్పించి.. లోకేష్ కు సవాల్ విసిరేందుకు అమరావతికి తీసుకెళ్లారు. వారి వెంట ఓ ముగ్గురు నలుగురు మహిళలు ఉన్నారు. వారి సవాల్ చేసేసరికి డీఎస్సీ అక్రమాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం వెనుక ఉన్న అంతరార్థం బయటపడింది. ఒకవైపు హోంమంత్రి వంగలపూడి అనిత వర్సెస్ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహారం నడిచింది. బాగా మాట్లాడావ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ ఫోన్ చేసి అభినందించినట్టు టాక్ నడిచింది. దానికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అయితే గుడివాడ అమర్నాథ్ మంత్రి వంగలపూడి అనిత పై చేసిన కామెంట్స్ మంచివే అన్నట్టు ఇప్పుడు లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామల బదులిచ్చారు. మొత్తానికి అయితే డీఎస్సీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదిలే అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నమాట.
