Jagan: ఏపీలో వైసిపి దారుణ ఓటమి పాలైంది.ఊహించని పరాభవం ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో కూరుకుపోయాయి. వై నాట్ 175 అన్న వైసీపీ శ్రేణులే.. 11 స్థానాలకు పరిమితం కావడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. అటు అధినేత జగన్ సైతం జనానికి అన్నీ చేసినా.. ఏంటి తీర్పు అంటూ మదన పడిపోయారు.ధైర్యం కూడా తీసుకుని కార్యకర్తలం వైపు అడుగులు వేశారు.నెమ్మదిగా కోరుకుంటూ పార్టీ అభ్యర్థులు,నాయకులతో ఓటమిపై సమీక్షించారు. ధైర్యంతో ముందుకు సాగుదామని.. 2029 ఎన్నికల్లో చంద్రబాబును సింగిల్ డిజిట్ కే పరిమితం చేద్దామని పిలుపునిచ్చారు. అయితే జగన్ రొటీన్ వ్యాఖ్యలు సొంత పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. ధైర్యం ఇవ్వడం లేదు.
ఓటమి నుంచి ముందుగా గుణపాఠాలు నేర్చుకోవాలి. అందుకు గల కారణాలను సమీక్షించాలి. కానీ జగన్ మాత్రం ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని ఆరోపించడం ఏంటి? ఆయన స్థాయికి తగ్గ ఆరోపణ కాదు. 2019 ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో గెలిచారు. అప్పుడు ఈవీఎం లే కదా? బ్యాలెట్ పేపర్లు లేవు కదా? అలాంటి ఆరోపణలు నేతగా జగన్ స్థాయిని దిగజార్చుతాయి. సొంత నియోజకవర్గ పులివెందుల వెళ్లారు. ఐదు రోజులపాటు అక్కడే ఉంటామని చెప్పుకొచ్చారు. కానీ రెండు రోజులకే పరారయ్యారు. రాయలసీమ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పులివెందుల వచ్చారు. వారికి ధైర్యం కల్పించాల్సింది పోయి.. పాడిందే పాట మాదిరిగా.. పాత చింతకాయ పచ్చడి మాదిరిగా.. ఓటమికి అవే కారణాలు చూపుతూ రాత పుట్టించారు జగన్.
ప్రజలకు వైసీపీ పట్ల చాలా విశ్వాసం ఉందట. పార్టీ ప్రజల గుండెల్లో ఉండి పోయిందట. ప్రజలు మళ్లీ తప్పకుండా వైసీపీ వైపు వస్తారట. లేనిపోని హామీలు ఇవ్వలేదట. అందుకే తాను ఓడిపోయారట. నీతి నిజాయితీతో రాజకీయాలు చేశారట. అందుకే వైసిపి ఓడిపోయిందట. అయితే అధినేత నోటి నుంచి ఇటువంటి మాటలు వినేసరికి పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో పార్టీపై విశ్వాసం ఉంటే ఎన్నికల్లో ఘోర పరాజయం ఎందుకు ఎదురవుతుందని ప్రశ్నిస్తున్నారు. కనీసం గౌరవప్రదమైన సీట్లు ఇచ్చేవారు కదా అని చెప్పుకొస్తున్నారు. సంక్షేమ ఫలాలను కోట్లాదిమందికి అందించామని.. వారి ఓట్లు ఏమైపోయాయని జగన్ ప్రశ్నించారు. కానీ అదే జగన్ తన పాలన నచ్చితేనే ఓట్లు వేయాలని పిలుపునిచ్చిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు వచ్చినా.. తనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు.
ఓటమి ఎదురైనప్పుడు తప్పకుండా సమీక్ష చేసుకోవాలి. పోస్టుమార్టం నిర్వహించాలి. ఆత్మ పరిశోధన చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. ఎక్కడ వైఫల్యం చెందామా గుర్తించాలి. మళ్లీ ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నించాలి. కానీ ఇటువంటి మాటలేవీ జగన్ నోటి నుంచి రావడం లేదు. కేవలం ఈవీఎంల పైనో.. మరికొందరు పై నిందలు వేస్తేనో, పాలనలో లోపాలు దాచిపెడితేనో లాభం లేదు. జగన్ వైఖరి పూర్తిగా మారాలి. ప్రజలతో మమేకమై పనిచేయాలి. వాస్తవాలు గుర్తించగలగాలి. అప్పుడే ఓటమి నైరాశ్యం నుంచి బయటపడేది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More