Jagan: రాజకీయాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సోషల్ మీడియా ఉందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం పొరపాటు మాట్లాడితే క్షణాల్లో వైరల్ అవుతుంది. సొంత సోషల్ మీడియా ప్రతి పార్టీకి ఉంది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు.. ప్రత్యర్థులను సైతం టార్గెట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఏపీలో మాత్రం నారా లోకేష్ సోషల్ మీడియాకు నిరంతరం టార్గెట్ అయ్యేవారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంత కాదు. చివరకు ఆయనకు వ్యక్తిగత టార్గెట్ చేసిన సందర్భాలే అధికం. గతంలో లోకేష్ ఏదైనా మాట్లాడితే తడబడే వారు. దానిని పట్టుకొని ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే. గతంలో ఆయన మీడియా ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి శాసనసభకు వెళ్లడం లేదు. వారం వారం మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.
* అదే తడబాటు..
ఇటీవల జగన్ మాటల్లో తడబాటు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా.. బయట ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా.. ట్రోల్స్ కు అవసరమయ్యే మెటీరియల్ అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్ మీడియా ముందుకు వస్తున్నారంటే మీమ్ మెటీరియల్ దొరుకుతుందన్న పాక్ వినిపిస్తోంది. తాజాగా లడ్డూ కల్తీ వ్యవహారం మీద జగన్ చేసిన కామెంట్.. మీమర్స్ కు కంటెంట్ ఇచ్చింది. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చింది అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఇటీవల అదే విషయాన్ని చెప్పబోతూ తడబడ్డారు జగన్మోహన్ రెడ్డి. నెయ్యిలో నాన్ వెజ్ లేదు అంటూ వ్యాఖ్యానించారు. సరైన పదం దొరక్క ఆయన ఆ మాట వాడేసారు. తరువాత జంతు కొవ్వు అని సర్దుకున్నారు.
* అదే పనిగా ప్రచారం
అయితే జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి నాన్ వెజ్ అనే పదం రావడంతో మీమర్స్ తమకు పని చెప్పడం ప్రారంభించారు. నాన్ వెజ్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. మాటల తడబాటుతో దొరికిపోవడం జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్ కు గురయ్యారు. ఇప్పుడు భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశంతో ఇలాంటి కామెంట్ చేయడంతో మరింత విమర్శలు పాలవుతున్నారు. ఒకవైపు ఏపీలో కూటమి.. మరోవైపు నేషనల్ మీడియా ఏకిపారేస్తోంది. ఇటువంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి.. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.
