Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో భర్తల ఆరాటం

AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో భర్తల ఆరాటం

AP Elections 2024: రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు భర్తల కోసం భార్యలు ప్రచారం చేసేవారు. అయితే ఏదో నామమాత్రంగా తిరిగేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. భార్యల కోసం భర్తలు ఊరు వాడా తిరిగి ప్రచారం చేయాల్సి వస్తోంది. రాజశేఖర్ రెడ్డి మూడు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఆయన భార్య విజయమ్మ బయటకు రాలేదు. అటు చంద్రబాబు భార్య భువనేశ్వరిది కూడా అదే పరిస్థితి. నందమూరి తారక రామారావు భార్య బసవతారకం అయితే ఎన్నడూ రాజకీయ వేదికలను పంచుకున్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కచ్చితంగా నేతల భార్యలు అడుగు బయట పెట్టాల్సిందే. ఇక భార్యల కోసం భర్తల పరిస్థితి అదే. మొన్నటి వరకు తెర వెనుక ఉండే భర్తలు సైతం బయటకు రావాల్సిన పరిస్థితి దాపురించింది. సతుల కోసం ఎండనక వాననక ప్రజల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు.

ఈసారి చాలామంది మహిళా నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారికోసం భర్తలు ఎంతో ఆరాటపడుతున్నారు. రాజమండ్రి నుంచి బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు కావడంతో మిగతా చోట్ల ప్రచారానికి వెళుతున్నారు. దీంతో రాజమండ్రి పార్లమెంట్ స్థానం పరిధిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చూస్తున్నారు. గత కొద్ది వారాలుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. విద్యాధికులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరుతున్నారు.

ఏపీలో నెల్లూరు జిల్లా కోవూరు హాట్ సీట్. అక్కడ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గట్టిగానే పోరాడుతున్నారు. ఆయన సైతం నెల్లూరు ఎంపీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారంలో మూడు రోజులు పాటు కోవూరులో మకాం వేస్తున్న ప్రభాకర్ రెడ్డి భార్య గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

నగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారుఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా.గాలి కుటుంబంతో గట్టిగానే పోరాడుతున్నారు. ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ ఉండడంతో భర్త సెల్వమణి నేరుగా రంగంలోకి దిగారు. తమిళ నాడు సరిహద్దు ప్రాంతం కావడంతో స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ ఫిల్ములతో రోజాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

మంగళగిరిలో లోకేష్ ను ఎలాగైనా ఓడించాలని మహిళా నేత మురుగుడు లావణ్యను బరిలో దించిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా అటు మామ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇటు తల్లి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గట్టిగానే శ్రమిస్తున్నారు. లావణ్య భర్త అయితే పద్మశాలి సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతున్నారు

విడదల రజిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి రెండోసారి బరిలో దిగారు. ఆమెకు మద్దతుగా భర్త పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అటు టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కి మద్దతుగా.. ఆమె భర్త సైతం విస్తృత ప్రచారం చేస్తుండడం విశేషం. మొత్తానికైతే అప్పట్లో భర్తల కోసం భార్యలు శ్రమించేవారు. ఇప్పుడు భార్యల కోసం భర్తలు ఎండను లెక్కచేయకుండా ప్రచారం చేస్తుండడం గమనార్హం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular