Telugu States Dowry Deaths: బయట ఎలాగూ భద్రత లేదు.. అమ్మ కడుపులో కూడా సెక్యూరిటీ లేకపోతే ఎలాగమ్మా.. కార్తికేయ సినిమాలో గర్భవిచ్చితి చేసుకోవడానికి వచ్చిన ఓ మహిళలను ఉద్దేశించి హీరో పలికే డైలాగ్ అది. అది కేవలం సినిమా డైలాగ్ గా మాత్రమే చూడకూడదు. ఎందుకంటే బయట సమాజంలో పరిస్థితి ఇప్పుడు అంతకంటే దారుణంగా ఉంది. ఆడవాళ్లు అంటే అలుసుగా.. కడుపులో నలుసుగా చూస్తున్న క్రమంలో.. గర్భ విచిత్తులు పెరిగిపోతున్నాయి. తద్వారా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో లింగ నిష్పత్తి లో విపరీతమైన అంతరాయం ఉండడంతో చాలామంది అబ్బాయిలకు వివాహాలు జరగడం లేదు.
Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు
గడిచిన కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా యావత్ దేశం మొత్తం అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడమే కష్టంగా మారింది. ఫలితంగా చాలామంది బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది తమకు పెళ్లి జరిగితే చాలు అనే స్థాయికి దిగజారి పోయారు. కట్నాలు డిమాండ్ చేస్తే స్టేజి నుంచి ఎదురు కట్నం ఇచ్చే వరకు యువకుల పరిస్థితి మారిపోయింది. ఇంత చేసినప్పటికీ చాలామందికి పెళ్లి జరగడం లేదు.
ఈ పెళ్లిళ్ల సంగతి కాస్త అటు పెడితే.. వివాహం జరిగిన తర్వాత అత్తింటి వారింట్లో అమ్మాయిలకు ఏమాత్రం భద్రత ఉండటం లేదు. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు.. టిడిపి పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి లోక్సభలో ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో 1304 మంది మహిళలు వరకట్నం వేధింపులతో మరణించారట. 2019 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్లో 526.. తెలంగాణ రాష్ట్రంలో 776 కేసులు నమోదయ్యాయి. ఇక శిక్షల ఖరారు రేటు ఆంధ్రప్రదేశ్లో 11.5.. తెలంగాణలో 14.4% గా ఉంది. వరకట్న మరణాలలో ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు టాప్ స్థానంలో ఉన్నాయి. ఇక 2023లో దేశవ్యాప్తంగా 6156 మంది మహిళలు వరకట్నం వేధింపుల వల్ల చనిపోయారు. ఇందులో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే.. మిగతావారు హత్యకు గురయ్యారు.
