Jagan comments on Duvvada: సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు వారి స్థాయి బట్టి ప్రముఖులుగా మారుతారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండానే పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ). వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ మహిళతో ప్రేమాయణం సాగించి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ ప్రేయసి దివ్వెల మాధురి సినీ సెలబ్రిటీస్ కంటే ఫేమస్ అయిపోయారు. అయితే వ్యక్తిగత వ్యవహార శైలితో రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు దువ్వాడ శ్రీనివాస్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే ఇప్పుడు పార్టీకి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్ననే ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారిద్దరి మధ్య పలకరింపులతో పాటు కొద్దిసేపు సంభాషణ జరిగింది. దీంతో రకరకాల చర్చ మొదలైంది. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు జగన్ ముందు కొన్ని షరతులు పెట్టారని ప్రచారం నడుస్తోంది.
చూద్దామన్నారట..
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఏం స్పందించలేదని మరో ప్రచారం. నిన్ననే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అసెంబ్లీకి వచ్చారు. నాలుగు గేటు వద్ద ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలు నిర్వహించారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి కంటపడ్డారు. దీంతో జగన్ దువ్వాడ శ్రీనివాసును పలకరించారు. జగన్ కాళ్లకు నమస్కారం చేశారు దువ్వాడ. జగన్ భుజం తట్టారు. సినిమా హీరోల చేస్తున్నావా? వ్యాపారాలు బానే ఉన్నాయా అని ఆరా తీశారు. కుటుంబ వ్యవహారాలు గురించి కూడా అడిగారట. తాను వ్యక్తిగతమైన అంశాలను పరిష్కరించుకుంటున్నానని చెప్పారట. ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని జగన్ ప్రశ్నించగా మీరు ఏం చెబితే అదే అన్నారట దువ్వాడ శ్రీనివాస్. ఒకసారి కలిసి మాట్లాడతానని శ్రీనివాస్ చెప్పగా చూద్దామంటూ జగన్ వెళ్లిపోయారట. వారి మధ్య సంభాషణ ఇదే అంటూ అక్కడ ఉన్నవారు సైతం చెప్పుకొస్తున్నారట.
వారి మధ్య రాజీ..
అయితే తరువాత దువ్వాడ శ్రీనివాస్ అదే తీరులో మాట్లాడారు మీడియాతో. తనకు జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి ఇబ్బందులు లేవని.. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల తీరుతో వైసిపికి నష్టం జరుగుతుందన్నట్టు మరోసారి వ్యాఖ్యానించారు దువ్వాడ శ్రీనివాస్. ధర్మాన సోదరులను వదులుకునే పరిస్థితుల్లో జగన్ లేరు. అలాగని దువ్వాడ శ్రీనివాస్ తన విషయంలో ఆరాధన భావంతో ఉన్నాడు. ఒకవేళ వైసీపీ టికెట్ రాకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారు. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. అందుకే ధర్మాన సోదరులతో దువ్వాడ శ్రీనివాస్ కు రాజీ చేయిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే తన పొలిటికల్ లైఫ్ నాశనం కావడానికి ధర్మాన సోదరులే కారణమని దువ్వాడ ఆగ్రహంతో ఉన్నారు. మరి జగన్ చేసిన ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.