CM Chandhrababu Delhi Tour : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన పర్యటన రాజకీయమా? లేకుంటే అధికారిక పర్యటన? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏపీకి గుడ్ న్యూస్ అందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజులపాటు ఢిల్లీలోనే చంద్రబాబు గడపనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. 164 స్థానాలతో తిరుగులేని విజయాన్ని సాధించింది. అటు ఎన్డీఏలో సైతం తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామ్యం అయ్యింది. ముచ్చటగా కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకంగా మారింది. అప్పటినుంచి చంద్రబాబు ప్రాధాన్యత పెరిగింది. కేంద్ర పెద్దలు సీఎం చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రజలతో సఖ్యతగా మెలుగుతూ వస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం నుంచి నిధులు పొందుతున్నారు. దేశంలోనే ఏపీ సింహభాగం ప్రయోజనాలు పొందేందుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో చాలాసార్లు చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఆ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా రకాల సాయం అందుతూ వచ్చింది. అందుకే ఈసారి చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
* ప్రపంచ బ్యాంకు రుణం ఈజీగా
అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15వేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది గ్రాంటా? రుణమా? అన్నదానిపై వివాదం కొనసాగింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రూపంలో కేంద్రం ఈ మొత్తాన్ని సమకూర్చింది. అయితే ఇందులో 90 శాతం కేంద్రమే భరిస్తుందని ఇటీవల స్పష్టత వచ్చింది. అటు కేంద్రానికి సైతం ప్రపంచ బ్యాంకు నుంచి లేఖ వచ్చింది. సాధారణంగా ప్రపంచ బ్యాంకు నిధులు అంత ఈజీగా మంజూరు కావు. కానీ పలుమార్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. రుణం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవంబర్లో తొలి విడతగా 3750 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
* ఆ రెండు అంశాలు కీలకమే
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12 వేల కోట్ల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అయితే ఇంకా నిధులు విడుదల కాలేదు. మరోవైపు విశాఖలో రైల్వే జోన్ శంకుస్థాపనకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్.. ఈ మూడు అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే భారీ స్కెచ్ తోనే చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలతలు వస్తాయో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More