Chandrababu: వైఎస్ షర్మిల, సునీతలు దూకుడు పెంచారు. కడపలో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి బలంగా మద్దతు లభిస్తోంది. ఇది చంద్రబాబులో కలవరపాటుకు కారణం అవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వెళితే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు గ్రహించారు. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీని పిల్ల కాంగ్రెస్ తో పోల్చి.. షర్మిల, సునీత వ్యాఖ్యలతో కాంగ్రెస్ వైపు ప్రజా వ్యతిరేక ఓటు వెళ్లకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులపాటు ఆ ఇద్దరు మహిళలకు చంద్రబాబు అండగా నిలుస్తూ వచ్చారు. చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ సైతం ఈ విషయంలో హెచ్చరించినంత పని చేశారు. ఎన్డీఏ ఓట్లు చీల్చేందుకు జగన్, షర్మిల నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారు.
కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. అక్కడ జగన్ గత రెండు ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సాధిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో కడప అడ్డాలోనే జగన్ ను దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల తో పాటు వివేక కుమార్తె సునీతతో జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. వివేక హత్య కేసు విషయంలో వైఎస్ సునీత వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న ఆరోపణ. అటు షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనక సైతం ఆయనే ఉన్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ ఇద్దరూ జగన్ టార్గెట్ చేసుకునే విధానం కూడా ఒకే మాదిరిగా ఉంది. అదే సమయంలో వారు చంద్రబాబును పల్లెత్తు మాట కూడా అనడం లేదు.
ప్రస్తుతం కడపలో తెలుగుదేశం పార్టీ సైతం యాక్టివ్ గా ఉంది. కడప లోక్సభ స్థానం నుంచి భూపేష్ రెడ్డి పేరును సైతం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పుడు షర్మిల దూకుడు పెంచి మోతాదుకు మించి విమర్శలు చేస్తుండడంతో.. అక్కడ ఫైట్ కాంగ్రెస్, వైసీపీ మధ్య అన్న రేంజ్ లో వచ్చింది. తెలుగుదేశం పార్టీ తేలిపోతోంది. ఇది ఇలానే కొనసాగితే జగన్ ప్రభుత్వం పై ఉండే వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్ కు భారీ అడ్వాంటేజ్. తెలుగుదేశం పార్టీ మూడో ప్లేస్ కి పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే చంద్రబాబు ఆలస్యంగా మేల్కొన్నారు. ప్రధాని మోదీ హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్నారు. అందుకే ఇప్పుడు రంగంలోకి దిగారు. వైసీపీని పిల్ల కాంగ్రెస్ గా అభివర్ణించడం ప్రారంభించారు. కాంగ్రెస్, వైసిపి ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలను ఓడించి.. కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరడం విశేషం. మొత్తానికైతే కడప అడ్డాలో చంద్రబాబు ప్లాన్.. తిరిగి టిడిపికి చేటు తెచ్చే అవకాశాలు ఉండడంతో జాగ్రత్త పడ్డారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More