Chandrababu: తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నూతన కార్యవర్గాల ప్రమాణస్వీకారం వేడుకగా సాగింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆయన సీనియర్ల ఆశీర్వచనాలు అందుకున్నారు. సీనియర్ నేతలు అందరికీ పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందారు. ఒక్క విధంగా చెప్పాలంటే ఆయన పట్టాభిషిక్తుడు అయ్యారు తెలుగుదేశం పార్టీకి. ఈ తంతును ఒక వేడుకగా, ఒక బాధ్యతగా పూర్తి చేశారు సీఎం చంద్రబాబు. అయితే ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. టిడిపి కార్యవర్గాల నియామకాల కు సంబంధించి చాలా రకాల అభ్యంతరాలు వచ్చాయని.. కొందరు తమ అనుమతి లేకుండా ఎలా కార్యవర్గాల్లోకి తీసుకుంటారని ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. పనిచేసే వారు ఎవరు? పనిచేయని వారు ఎవరు? అనేది తమకు తెలుసునని.. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసిన వారిని మాత్రమే పదవులు ఇచ్చిన విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు చంద్రబాబు. తద్వారా ఇదంతా లోకేష్ టీం అని.. భవిష్యత్తులో లోకేష్ తో పని చేసే టీం అని తేల్చి చెప్పారు చంద్రబాబు. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో ప్రత్యామ్నాయ నేతలు అని సంకేతాలు పంపగలిగారు.
* కొత్తవారికి చోటు..
ఈసారి టిడిపి కార్యవర్గంలో కొత్త వారికి చోటు ఇచ్చారు. అనూహ్యంగా టిడిపి పొలిట్ బ్యూరోలో( TDP polit buro ) కొత్త నేతలకు ఛాన్స్ ఇచ్చారు. పాత నేతలను తొలగించారు. ద్వితీయ శ్రేణి పార్టీ నేతలకు సైతం అవకాశాలు ఇవ్వడం విశేషం. ఆ కోటాలో సభ్యురాలు అయ్యారు విజయనగరం జిల్లాకు చెందిన గంటేడ శ్రీదేవి. ఆమె ప్రస్తుతం గజపతినగరం టిడిపి అధ్యక్షురాలుగా ఉన్నారు. గతంలో ఎంపీపీగా పని చేశారు. ఆమెను తీసుకొచ్చి టిడిపి పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించడం నిజంగా సాహసం. చాలామంది నేతలను ఇదే మాదిరిగా తీసుకున్నారు. దశాబ్దాలుగా ట్రాక్ రికార్డు చూసి మరి ఎంపిక చేశారు. చాలామంది నేతలు స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకులుగా ముద్రపడ్డారు. పార్టీ పరంగా మాత్రం మంచి పేరు వారికి ఉంది. అటువంటి వారికి నూతన కార్యవర్గాల్లోకి తీసుకుని చక్కటి సంకేతాలు పంపారు అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే చాలామంది అభ్యంతరాలు తెలిపారని.. తమ అనుమతి లేనిది కార్యవర్గాల్లో ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన విషయాన్ని చంద్రబాబు సభలోనే ప్రకటించారు.
* ప్రత్యామ్నాయ నాయకత్వం.. చంద్రబాబు( Chandrababu) తీసుకున్న నిర్ణయం లోకేష్ టీం కోసం అని అంతా భావిస్తున్నారు. కానీ ఆయన ఒక అడుగు ముందుకు వేసి వచ్చే ఎన్నికల్లో సైన్యాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ వ్యక్తిగత తీరుతో, వివాదాలతో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్న వారికి ప్రత్యామ్నాయంగా.. ఈ నేతలకు చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ హయాంలో పార్టీ కార్యవర్గంలో ఉన్నవారు సీనియర్లుగా మారారు. చంద్రబాబు హయాంలో నియమితులైన వారు సైతం సీనియర్లు అయిపోయారు. ఇప్పుడు వారితో పార్టీని నెట్టుకు రావడం అంత సులువైన పని కాదు. అందుకే చంద్రబాబు ఇప్పుడు భవిష్యత్తు టిడిపి కోసం ఈ కొత్త నియామకాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రతి చోట ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా.. ఎమ్మెల్యేలు సిఫార్సు చేయని వారి పేర్లు కార్యవర్గంలోకి రావడం మాత్రం నిజంగా సాహసమే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి పనిచేసిన నేతలను మాత్రమే టిడిపి కార్యవర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు.