Central Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం.. ప్రభుత్వాలు కొలువు తీరడం జరిగిపోయింది. ఇక 2029 సార్వత్రిక ఎన్నికలపై బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. బిజెపితోపాటు ఎన్డీఏ ను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. అందుకే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈసారి యువతకు ప్రాధాన్యం ఇచ్చి 2029 ఎన్నికలపై గురిపెట్టనున్నారు. ఎన్డీఏ లోని మిత్రులకు ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ప్రధానంగా ఈసారి జనసేనకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరు నివేదిక ప్రధాని నరేంద్ర మోడీ కి చేరింది. దానికి అనుగుణంగా కొత్తవారికి ఛాన్స్ ఇస్తారు ప్రధాని నరేంద్ర మోడీ.
* ప్రధాని విదేశీ పర్యటన..
ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి ఈనెల 20న చేరుకోనున్నారు. వచ్చిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు ఛాన్స్ ఇవ్వచ్చు అనే సమాచారం ఉంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఏపీ నుంచి ఈసారి జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. అప్పట్లోనే జనసేనకు ఒక మంత్రి పదవి ఇస్తామంటే పవన్ కళ్యాణ్ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ఈసారి మాత్రం మంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఏపీ నుంచి ఒక మంత్రి పదవి ఖాయమని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.
* ఆశావహులు అధికం..
తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఈసారి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు ఖాయమని తెలుస్తోంది. టిడిపికి కానీ మరో మంత్రి పదవి ఇస్తే.. హిందూపురం ఎంపీకి కానీ.. చిత్తూరు ఎంపీ కి కానీ ఛాన్స్ ఇస్తారని సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు బిజెపి ఎంపీ కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి అవకాశం దొరికే పరిస్థితి కనిపిస్తోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సైతం ఆశావహుడుగా ఉన్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ పై ఒక క్లారిటీ వస్తుంది. చూడాలి అవకాశం ఎవరికి దక్కుతుందో..