YS Sharmila: ఏపీలో పూర్వ వైభవానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. షర్మిల కు పిసిసి పగ్గాలు అందించాక పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీ సైతం తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ ప్రజలను దగ్గర చేసుకునేందుకు వరుసుగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీ అన్న పరిస్థితి ఉండగా.. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ సైతం సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. మరోవైపు సంక్షేమ పథకాలే తారకమంత్రంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించింది. ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేసుకుంటూ షర్మిల ముందుకు సాగుతున్నారు.
ఏపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రేపు తొలి జాబితాను ప్రకటించనుంది. షర్మిల కడప ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఖరారయ్యారు. టిడిపి నుంచి భూపేష్ రెడ్డి ఎంపీగా బరిలో నిలవనున్నారు. షర్మిల ఎంట్రీ తో అక్కడ త్రిముఖ పోరు ఖాయం. షర్మిల ఎక్కువగా వైసీపీ ఓట్లను చీల్చుతారు. ఇది టిడిపి అభ్యర్థికి భారీ అడ్వాంటేజ్.కానీ వైసీపీకి క్షేత్రస్థాయిలో బలం ఉండడం, వైయస్ కుటుంబానికి ఎక్కువగా అభిమానించడం వంటి కారణాలతో రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి.
ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య కేసు తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. ఎన్నికల ముంగిట కావడంతో వైసిపికి సానుభూతి లభించింది. అదే ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణలో ఆశించిన స్థాయిలో ఆసక్తి చూపలేదు. పైగా నిందితులకు కొమ్ముకాస్తున్నారు అన్న అపవాదును ఎదుర్కొన్నారు. ఈ పరిణామ క్రమంలో వైయస్ కుటుంబం అడ్డగోలుగా చీలింది. ఆ కుటుంబ అభిమానుల సైతం పునరాలోచనలో పడ్డారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తుండడంతో.. రాజకీయంగా సంచలనంగా మారింది. తప్పకుండా వైసిపి ఓట్లు గణనీయంగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసిపికి ఇక్కడ అంతిమంగా నష్టం తప్పదని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.మరోవైపు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను.. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సంక్షేమానికి పెద్దపీట వేసింది. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎంతవరకు ప్రభావితం చేయగలరో అన్నది చూడాలి.