Andhra Pradesh Rain Alert: ఏపీకి( Andhra Pradesh) వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని చెబుతోంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చు. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
* అల్పపీడనంగా మారే అవకాశం..
హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా రాయలసీమపై( Rayalaseema ) ఉంటుంది. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి- మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల కింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
* పెరుగుతున్న ఎండలు..
రాష్ట్రంలో క్రమేపి చలి తగ్గుతోంది. ఎండ తీవ్రత పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు( temperatures ) సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్నూలులో ఏకంగా 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ప్రారంభంలోనే ఇలా ఉంటే.. నడి వేసవిలో వాతావరణం ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపి పెరగడం చూస్తుంటాం. కానీ ఈ ఏడాది మాత్రం సంక్రాంతి నుంచి ఎండల తీవ్రత విశేషం.