Andhra Pradesh Revenue Growth: ఒక ఎకో సిస్టం డెవలప్ కావాలంటే అక్కడ అనుకూల పరిస్థితులు సృష్టించాలి. అవి సృష్టించాలంటే అక్కడి నాయకత్వానికి దూర దృష్టి ఉండాలి. అలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయగలడు. దానికోసం అవకాశాలను సృష్టించగలడు. అంతిమంగా ఆ ప్రాంతాలను గొప్పగా వృద్ధి చేయించగలడు. అలాంటి నాయకుడే ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దార్శనికత వల్ల ఏపీ కథ మొత్తం మారిపోయింది.
ఏ ప్రభుత్వానికైనా ఆదాయం అత్యంత అవసరం. ఎందుకంటే ఆదాయం ఉంటేనే అభివృద్ధి పనులు చేయడానికి సాధ్యమవుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలవుతుంది. ఆదాయం రావాలంటే ప్రజల్లో నమ్మకం పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి.. అభివృద్ధి సాధ్యమవుతుంది.. ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది.. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉండేది. అప్పులు మాత్రం దారుణంగా ఉండేది. ఈ క్రమంలో నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన అనుభవాన్ని మొత్తం రంగరించారు. ఫలితంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి బాట పట్టింది.
ఆదాయం అదరహో
ఏపీ రాష్ట్రానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పరిశీలనకు తీసుకుంటే.. గత ఆర్థిక సంవత్సరం అద్భుతమైన వృద్ధి కనిపించింది. అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే ఇది ఏకంగా 25% ఎక్కువ. బడ్జెట్ అంచనాలను దాదాపు 98.4% సాధించింది. 2024-2025లో 8, 847 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025-26 లో 11,056 కోట్లకు చేరుకుంది. డిజిటల్ విధానం, పరిపాలన సంస్కరణల వల్ల రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల కనిపించింది.. ఈ స్థాయిలో ఆదాయం సాధించడం అంటే మామూలు విషయం కాదు.. పైగా ఇంతటి వృద్ధి అన్ని రకాల వసతులు ఉన్న రాష్ట్రాల్లో కూడా సాధ్యం కాలేదు. కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. రాజధాని నగరంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతూ ఉండడం.. ప్రభుత్వపరంగా సానుకూల నిర్ణయాలు కనిపిస్తూ ఉండడంతో.. ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అమాంతం దూసుకుపోయింది.. ఇదే జోరు గనుక కొనసాగితే వచ్చే రోజుల్లో కూడా ఆదాయం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
“ఆంధ్రప్రదేశ్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఒకప్పటి మాదిరిగా ఒత్తిడి లేదు. అన్ని అనుమతులు త్వరగానే వస్తున్నాయి. భూమి కేటాయింపులు కూడా జరిగిపోతున్నాయి.. ప్రభుత్వం రంగంలోకి దిగి అన్ని రకాల అనుమతులు త్వరగానే లభించేలా చేస్తుంది. ముఖ్యంగా డిజిటల్ విధానంలో భూ వ్యవహారాలు సాగుతున్నాయి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోతున్నాయి. ఇవి మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నాయని” భూములు కొనుగోలు చేస్తున్న వారు అంటున్నారు.
