Andhra Pradesh Rajya Sabha Elections 2026: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. జూన్ తో రాష్ట్రానికి సంబంధించి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మూడు నెలల ముందే సన్నాహాలు ప్రారంభిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఏపీకి సంబంధించి ఆ నాలుగు రాజ్యసభ సీట్లకు సంబంధించి వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే కూటమి పార్టీలు మధ్య రాజ్యసభ సీట్ల పంపకాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సూత్రప్రాయంగా అవి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రెండు, బిజెపికి ఒకటి, జనసేనకు ఒకటి కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనిపై నిన్ననే పవన్ కళ్యాణ్ తో సీఎం చంద్రబాబు చర్చించి ఉంటారని ఒక ప్రచారం నడుస్తోంది. కేవలం అభివృద్ధి పైనే తమ మధ్య చర్చ జరిగిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నా.. రాజ్యసభ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులపై చర్చించి ఉంటారన్న అనుమానం ఉంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* నాలుగు స్థానాలకు ఎన్నిక
దేశవ్యాప్తంగా జూన్లో 70 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏపీకి సంబంధించిన నలుగురు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి( alla Ayodhya Ram Reddy ), పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు టిడిపికి చెందిన సానా సతీష్ సైతం పదవీ విరమణ చేస్తారు. అయితే ఆయన ఎంపిక జరిగి ఏడాదిన్నర అవుతోంది. అప్పట్లో నియమించిన సమయంలోనే మరోసారి ఆయనకు ఛాన్స్ ఉంటుందన్న హామీ తోనే ఎంపిక చేశారు. దీంతో ఖాళీ అవుతున్న నాలుగింటిలో సానా సతీష్ కు ఒక పదవి ఖాయం. ఈ లెక్కన టిడిపికి ఒక పదవి సర్దుబాటు అయినట్టే. మిగతా మూడు పదవులు కూటమి పార్టీలు సరి సమానంగా పంచుకోనున్నాయి. దీనిపైనే నిన్న పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చించి ఉంటారన్న అంచనాలు ఉన్నాయి.
* ఆశావహులు అధికం..
సాధారణంగా రాజ్యసభ ( Rajya Sabha )అంటేనే విపరీతమైన పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఓ అరడజను మంది ఆ ఉన్న ఒక్క రాజ్యసభ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా సీనియర్లతోపాటు జూనియర్లు పదవిని కోరుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, మహాసేన రాజేష్, చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటివారు టిడిపిలో ఆశావహులుగా ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. అయితే ఆయన పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుకు సైతం సన్నిహితుడు. ఆయన విషయంలో ఎటువంటి అభ్యంతరాలు కూడా ఉండవు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తెచ్చిన క్రమంలో.. ఈసారి రాజ్యసభ పదవులు ఆ సామాజిక వర్గానికి కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో రాజ్యసభ సభ్యుల ఎంపిక ఆ రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. చూడాలి మరి ఎంపిక ఎలా ఉంటుందో..