AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం పూర్తి చేసి మిగతా రెండున్నర సంవత్సరాల పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. కేవలం 40 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, అదే సమయంలో ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. చివరిగా పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి స్థానిక సంస్థల కు పాలకవర్గాలను తేవాలని భావిస్తోంది. విజయదశమి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితేనే ఆర్థిక సంఘం నిధుల విడుదలకు అవకాశం ఉంటుంది. కేంద్రం విడుదల చేసే నిధులకు మోక్షం కలుగుతుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
* ముందుగా మున్సిపోల్స్..
రాష్ట్రవ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లతో పాటు 108 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పాలకవర్గం గడువు మార్చి తోనే ముగిసింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తాంది ప్రభుత్వం. దానికి కారణం లేకపోలేదు. పట్టణాల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది. పైగా మిగతా మిత్రపక్షాలతో పోల్చుకుంటే టిడిపికి బలం ఎక్కువ. అందుకే పొత్తులో భాగంగా మున్సిపాలిటీలను జనసేనకు కేటాయించి.. మెజారిటీ మున్సిపాలిటీలను మాత్రం టిడిపి తీసుకోవాలని చూస్తోంది. బిజెపికి సైతం కొంత భాగస్వామ్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్కడకు పక్షం రోజుల వ్యవధిలోనే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తోంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్తులు కాకుండా.. 26 జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్తు ఎన్నికలు జరగనున్నాయి.
* చివరిగా పంచాయతీలకు..
చివరిగా పంచాయతీ ఎన్నికలను అక్టోబర్ మొదటి వారంలోనే మూడు విడతల్లో పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంటే విజయదశమి లోపు దాదాపు అన్ని స్థానిక సంస్థలకు పాలకవర్గాలు తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలతో పాటు ప్రాదేశిక ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆ ప్రభావం పంచాయితీ ఎన్నికలపై కూడా పడుతుంది. ఈ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం సీట్లను సంపాదించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన. గతం మాదిరిగా కాకుండా.. ఏకగ్రీవాలను తగ్గించి.. పోటీ వైపే మొగ్గు చూపించి వైసిపికి మరోసారి షాక్ తినిపించాలని చూస్తోంది కూటమి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పక్కా వ్యూహం అమలు చేయనుంది. చూడాలి ప్రభుత్వ ప్రయత్నం, ఆలోచన ఎంతవరకు ఫలిస్తుందో..






