AP Housing Scheme: ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులందరికీ ఇళ్లు అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రానికి నాలుగు లక్షల ఇళ్ళు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వారం,పది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద భారీగా ఇళ్ల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో.. ఇళ్ల మంజూరుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది.
* రాష్ట్ర వ్యాప్తంగా సర్వే..
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే హౌస్ ఫర్ ఆల్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇళ్లతోపాటు ఇంటి స్థలాలు అవసరమైన వారి వివరాలను సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది లక్షల మందికి పైగా ఇళ్లు అవసరం అని ఈ సర్వేలో తేలింది. కానీ గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ల పేరుతో కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి లబ్ధిదారులకు సెంటు స్థలం చొప్పున అందించారు. అందులోనే ఇంటి నిర్మాణం చేపట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం భారీగా ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఆ లేఅవుట్లలో ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లు పూర్తి చేయకుండా కొత్త ఇళ్ల మంజూరు అనేది జరగని పనిగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేవలం 77 వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది. అవి ఏ మూలకు చాలడం లేదు.
* స్థానిక ఎన్నికల దృష్ట్యా..
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారని సర్వేలో తేలింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఈ తరుణంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేపట్టాలని చూస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0 పథకం కింద నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి వారం, పది రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ఇది పేదలకు శుభవార్త.