Andhrapradesh: టైర్ వన్, టైర్ టు, టైర్ త్రీ.. ఇలా మూడంచల విధానంలో వ్యాపారం చేస్తోంది డి మార్ట్. పప్పుల నుంచి ఉప్పుల దాకా.. బట్టల నుంచి నెత్తికి రాసుకునే నూనె దాకా ఇలా ప్రతి వస్తువును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చి.. తక్కువ ధరలో అమ్ముతూ తిరుగులేని మార్కెట్ ను డి మార్ట్ సొంతం చేసుకుంది.
గతంలో ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలో బిగ్ బజార్ ఉండేది. ఆ తర్వాత రిటైల్ విభాగంలోకి అనేక పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి. కాకపోతే అవేవీ కూడా మార్కెట్ పరిస్థితులను అంచనా వేయలేక.. సరైన వాటాను సొంతం చేసుకోలేకపోయాయి. రిలయన్స్.. ఆదిత్య బిర్లా.. ఇంకా అనేక పేరు మోసిన సంస్థలు ఉన్నప్పటికీ రిటైల్ విభాగంలో ఆశించిన మార్కెట్ వాటాను అందుకు లేకపోయాయి. కాకపోతే డిమార్ట్ డిఫరెంట్ ప్లాన్ తో రంగంలోకి వచ్చింది. తిరుగులేని మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. దీనిపై అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నప్పటికీ డీమార్ట్ దూకుడు జోరుగాని సాగుతోంది.
డి మార్ట్ దూకుడుకు కళ్లెం వేయడంలో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలే తట్టుకోలేకపోయాయి. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను ఏపీ ప్రభుత్వం భుజాలకు ఎత్తుకుంది. వాస్తవానికి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టడం.. అది కూడా ఒక ప్రభుత్వం చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వాస్తవానికి డీమార్ట్ చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలకు మరింత తక్కువ ధరలో సరుకులు అందించడానికి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డీమార్ట్ కు పోటీగా అదే స్థాయిలో మీ మార్ట్ ఏర్పాటు చేస్తోంది. తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులను అందించడానికి నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ సహకారం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీ మార్ట్ లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటివరకు ఏకంగా 870 షాపులను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరో 130 షాపులను వేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తోంది. అక్టోబర్ 1 న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మీ మార్ట్ లను ఒకేసారి ప్రారంభించబోతున్నారు. డి మార్ట్ తో పోటీపడేందుకు.. సేమ్ అదే కాన్సెప్ట్ తో మీ మార్ట్ లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తక్కువ ధరకే సరుకులు అందించేలా వీటిని రూపొందిస్తుంది. ముందుగా మీ మార్ట్ లలో 64 సరుకులను అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత మరిన్ని సరుకులను విస్తరిస్తారు. తద్వారా ఏపీ ప్రజలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా.. వారికి నాణ్యమైన సరుకులు అందిస్తారు