Andhra Pradesh New Pensions: ఏపీలో( Andhra Pradesh) పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. జూన్ నుంచి కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కూటమి వచ్చిన తర్వాత కేవలం స్పౌజ్ పింఛన్లు మాత్రమే అందించింది. కానీ కొత్తగా వితంతు పింఛన్లు ఇంతవరకు అందించలేదు. దీంతో ముందుగా వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మంది వితంతు పింఛన్లకు అర్హులుగా తేలింది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ నాటికి రెండేళ్లు పూర్తవుతుంది.. ఆ సందర్భంగా వితంతు పింఛన్లు మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వితంతువులకు పూర్తయిన తర్వాత దివ్యాంగులకు సైతం కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. క్రమేపి పురుషుల్లో కూడా కొత్తవారికి, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు అందించనుంది ప్రభుత్వం.
* రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో..
ఈ ఏడాది జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. ఆ రోజు నుంచి వితంతు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 1.53 లక్షల మంది వితంతు పింఛన్లకు అర్హులు అని అంచనాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్లు మంజూరు చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. నాలుగు వేల రూపాయల చొప్పున వీరికి పింఛన్ మొత్తం అందనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతినెల రూ.61 కోట్లు అదనపు భారం పడనుంది.. అయితే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ముందుగా వితంతువులకు, తర్వాత దివ్యాంగులకు, చివరిగా ఓల్డ్ ఏజ్ వారికి పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* స్పౌజ్ కోటా కింద సైతం..
ఇప్పటికే స్పౌజ్ ( spouse) కోటా కింద భర్త పెన్షన్ లబ్ధిదారుడు అయి ఉండి.. అకస్మాత్తుగా చనిపోతే భార్యకు పింఛన్ వర్తింపజేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోతే ఆ నెల నుంచి భార్యకు పింఛన్ వర్తింపజేశారు. ఇలా ఇప్పటివరకు 2.30 లక్షల మందికి కొత్త పింఛన్లు అందజేశారు. అయితే వితంతువులు లక్షలాదిమంది పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే వారికి ముందుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు దివ్యాంగులకు సైతం అందించేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. దివ్యాంగుల కోటాలో ఏకంగా లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 6.50 లక్షల మంది దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఏపీలో కొత్త పింఛన్ల ప్రక్రియ అప్పుడే ప్రారంభం అయ్యింది.