Andhra Pradesh Heatwave: ఏపీలో( Andhra Pradesh) భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకు వేసవి తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నడి వేసవి రాకముందే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజలు రోడ్లపై వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఉదయం 10 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత అలానే ఉంటుంది. మున్ముందు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేస్తోంది. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనాలతో వర్ష ప్రభావం ఉండేది. ఇప్పుడు మేఘాలు సైతం కనుమరుగవ్వడంతో ఎండలు దంచి కొడుతున్నాయి.
* అంతటా 40 డిగ్రీలు..
శ్రీకాకుళం ( Srikakulam )నుంచి చిత్తూరు వరకు ఒకేలా ఉంది పరిస్థితి. అంతట 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 200 మండలాలకు పైగా ప్రతిరోజు వడగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉడికిస్తోంది ఎండ. కొన్ని ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీలకు దాటుతుండడంతో అగ్ని వాతావరణం నెలకొంటోంది. మంగళవారం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం లో గరిష్ట ఉష్ణోగ్రతగా 44.4° డిగ్రీలు గా నమోదయింది. రాష్ట్రంలోని 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
* ఈరోజు శ్రీకాకుళంలో 19, విజయనగరంలో 21, పార్వతీపురం మన్యంలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు, పోలవరం జిల్లాలో ఐదు, విశాఖలో ఒకటి, అనకాపల్లిలో 15, కాకినాడలో ఆరు, తూర్పుగోదావరిలో రెండు మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
* ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ లకు మెసేజ్ రూపంలో సమాచారం అందిస్తూనే ఉంది.. ఎండల తీవ్రత దృష్ట్యా బయటకు వెళ్ళినప్పుడు చెవుల్లో వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించింది. తలకు టోపీ లేదా కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని, ఎండ తీవ్రత కళ్ళపై పడకుండా ఉండేలా సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచిస్తోంది.
* మరోవైపు ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కానీ మిగతా ప్రాంతాలంతా ఎండ తీవ్రత కొనసాగనుంది.