Anant Babu: వైసిపి హయాంలో ఓ ఎమ్మెల్సీ డ్రైవర్ దారుణ హత్య సంచలనంగా మారింది. అయితే అప్పట్లో చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత బాబు స్వయంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారని కూడా స్పష్టమవుతుంది. అయితే హత్య కేసులో కొద్ది రోజులపాటు ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ఉన్నారు. తర్వాత బయటకు వచ్చేసారు. దళిత సంఘాల ధర్నాలు, ఆందోళనలకు ఎటువంటి ఫలితం లేకపోయింది. ఎందుకంటే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా సీరియస్ తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మళ్లీ వేగవంతం అయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో సంచలన ఆదేశాలు ఇచ్చింది. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సీనియర్ న్యాయ అధికారిని పర్యవేక్షణ కోసం నియమించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. అప్పట్లో నిందితుతో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది.
* వైసిపి హయాంలో ఘటన..
2022 మే 19న అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు రావడం అప్పట్లో ప్రకంపనలు సృష్టించాయి. అనంత బాబు హత్య చేశారని అప్పటి జిల్లా ఎస్పీ మీడియాకు కూడా వివరించారు. అనంతబాబును పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో అనంతబాబు బెయిల్ కోసం మొదట రాజమండ్రి జిల్లా కోర్ట్, ఆపై హైకోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టులూ ఆయన బెయిల్ ను తిరస్కరించాయి. చివరికి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2022 చివర్లో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతబాబు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అప్పట్లో ఆయన స్వాగత కార్యక్రమాలు కూడా విమర్శలకు తావిచ్చాయి.
* కేసు విచారణ వేగవంతం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతబాబు కేసు లో పురోగతి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించింది ఈ కేసుకు న్యాయపరంగా చేయూతనందించేందుకు ముప్పాళ్ళ సుబ్బారావు అనే సీనియర్ న్యాయవాదిని ప్రభుత్వం తరఫున నియమించింది. అయితే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి పై మొన్న ఆ మధ్యన విరుచుకుపడ్డారు అనంతబాబు. తాను కనుసైగ చేస్తే చాలు అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఇంకోవైపు హత్య జరిగిన సమయంలో అనంత బాబు భార్య సైతం అక్కడే ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఆమెను సైతం అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక ఆదేశాలు ఇవ్వడం విశేషం.