Ambati Rambabu: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు బెయిల్ వచ్చిందని ఆనందపడే లోపు మరో సమస్య వచ్చి పడింది. గత 12 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి ముందుగా ఆయనకు బెయిల్ లభించింది. నిన్ననే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బెయిల్ ఇచ్చింది కోర్టు. ఈరోజు ఆయన విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరో కేసుతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై పిటి వారెంట్ జారీ అయ్యింది. దీంతో ఈరోజు బెయిల్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నెల 31న ఆయన అరెస్టు జరిగింది. వరుసగా రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ రావడంతో ఈరోజు బయటకు వస్తారని అంతా భావించారు.
* సంబరాలకు వసూళ్లు..
గత ప్రభుత్వ హయాంలో అంబటి రాంబాబు ( ambati Rambabu)మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేవారు. అయితే సంక్రాంతి సంబరాలకు గాను అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా గుంటూరులోని కోర్టు బుధవారం పిటి వారెంట్ జారీచేసింది. ఈనెల 18 లోగా కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు పిటి వారెంట్ రావడంతో మరోసారి అరెస్టు తప్పేలా లేదు.
* కొత్త కేసులో పిటి వారెంట్..
ప్రతి సంవత్సరం సత్తెనపల్లిలో( sattenapalle ) అంబటి రాంబాబు నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు ను నిర్వహించేవారు. అయితే 2023లో నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లతో పింఛన్ రెండు లాటరీ టిక్కెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతి రోజు లాటరీ తీసి బహుమతులను పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఇలా లాటరీలు తీయడం చట్ట విరుద్ధమని జనసేన నేత గాది వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. రాంబాబు తో పాటు మరికొందరిపై సత్తెనపల్లి టౌన్ పోలీసులు 2023 జనవరి 16న కేసు నమోదు చేశారు. అదే కేసులో తాజాగా పిటి వారెంట్ జారీ అయింది. ఈనెల 18 లోగా ఆయనను కోర్టులో హాజరు పరుస్తారు. ఈ నేపథ్యంలో ఆయన విడుదల మరోసారి వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది.