Amaravati legal status: అమరావతికి( Amaravati capital ) చట్టబద్ధత విషయంలో ముందడుగు పడింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో మూజువాణి ఓటుతో బిల్లు గెలిచింది. దీంతో గత పదేళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి తెరదించుతూ అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా స్పష్టత ఇచ్చినట్లు అయింది. లోక్సభలో అమరావతిపై రెండు గంటలపాటు చర్చించారు. అయితే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషం. ముఖ్యంగా ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ క్లియర్ కట్..
ఆది నుంచి కాంగ్రెస్( Congress) పార్టీ అమరావతి రాజధానికి అనుకూలంగా ఉంది. ఈ చట్టబద్ధత అనే అంశం తెర పైకి వచ్చినప్పుడు.. రాష్ట్ర శాసనసభలో ఆమోదం తెలిపినప్పుడు కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల మద్దతు తెలిపారు. ఈరోజు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికంఠాగూర్ ఏపీ అభివృద్ధి కోసం అమరావతిని శాశ్వత రాజధానిగా తాము మనస్పూర్తిగా సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల తరహాలో అమరావతిని అభివృద్ధి చేయాలని.. అదే సమయంలో ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలను కూడా విస్మరించకూడదు అని సూచించారు. అదే సమయంలో ప్రత్యేక హోదా వంటి హామీలను కూడా కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం,బిజెపి, జనసేన, కాంగ్రెస్, వైసిపి, సమాజ్వాది పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రమంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. రాజధాని ఉద్యమంలో పోరాడిన మహిళలకు జేజేలు తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది అనే భరోసా ఇస్తుంది చట్టం. అమరావతి నిర్మాణం చంద్రబాబు ఆశయం అని.. కూటమి ఐక్యంగానే ఇది సాధించగలిగామని చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
బిజెపి ఎంపీ పురందేశ్వరి, సీఎం రమేష్ లు మాట్లాడుతూ అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని.. ఇక ఎవరూ కదిలించలేరని తేల్చి చెప్పారు. వైసిపి హయాంలో అమరావతి అంధకారంలో పడిందని.. రైతుల పట్ల వైసిపి ప్రభుత్వం ఆమానుసంగా వ్యవహరించిందని గుర్తు చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిధున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని.. అవినీతి జరిగిందని.. అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేపట్టిన అంశానికి సంబంధించి తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వెళుతుంది. అక్కడ కూడా ఏకపక్షంగా పాస్ అవుతుంది. తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. మొత్తానికైతే అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించి కీలక అడుగులు పడ్డాయి.
అయితే జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోసారి చర్చకు దారితీసింది. అప్పట్లో మూడు రాజధానులు అన్నారు. ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చిన వారిలో గుణపాఠా lలు కలగకపోవడం జాతీయ స్థాయి నేతలు సైతం తప్పు పడుతున్నారు.
