Amaravati Capital: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా ఒక కొలిక్కి తేవాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందుకుగాను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు జరగలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నిరంతర సమీక్షల ద్వారా పనులు వేగవంతం చేయాలని చూస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని శాశ్వతం చేసేలా పావులు కదుపుతున్నారు. అమరావతికి చట్టబద్ధత తేవాలని భావిస్తున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి బిల్లును పార్లమెంట్లో పెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ‘మూసీ’ రాజకీయం.. కంపు కొడుతోంది పో!
* ఏకాభిప్రాయంతో నిర్ణయం..
ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు( CM Chandrababu). అందరి ఆమోదయోగ్యంతో 50 వేల ఎకరాలు సమీకరించి రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. అయితే రాష్ట్రంలో అధికారం మారిన తరువాత అమరావతి రాజధానిని కాదని.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. భూములు త్యాగం చేసిన రైతుల పోరాటాన్ని సైతం అణచివేసింది. ఈ క్రమంలో అమరావతి రైతుల ఆర్తనాదాలు మిన్నంటాయి. న్యాయస్థానాలతో పాటు దేవస్థానాలను ఆశ్రయించారు అమరావతి రైతులు. అయినా వారి కన్నీరును వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కొన్ని రకాల సాంకేతిక కారణాలతో అమరావతి రాజధాని తరలింపు ఆగింది. మూడు రాజధానుల అంశం ముందడుగు పడలేదు. లేకుంటే అమరావతి రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయేది.
* పార్లమెంటులో బిల్లు..
అయితే తమకు మరోసారి ఆ పరిస్థితి రాకూడదని భావిస్తున్నారు అమరావతి రైతులు. ప్రభుత్వాలు మారినా అమరావతి శాశ్వతం అన్న మాదిరిగా పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు. అందులో భాగంగానే కూటమి వచ్చిన వెంటనే.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు చంద్రబాబు. అయితే దేశంలో ఏ రాజధానికి చట్టబద్ధత లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు చంద్రబాబు. ప్రత్యేక విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి అయితే అమరావతి శాశ్వతం అనే మాట వినిపించనుందన్నమాట.