Akividu High Alert Temple Dispute West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో హై టెన్షన్ నెలకొంది. గత కొద్ది రోజులుగా ఒక ఆలయానికి సంబంధించిన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రస్థాయి అంశంగా మారింది ఈ వివాదం. ఈ నేపథ్యంలో చలో ఆకివీడు అంటూ సోషల్ మీడియాలో ఎవరో పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆలయ వివాదానికి సంబంధం ఉండడం.. మత విద్వేషాలు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వందలాది మంది పోలీసులు మోహరించారు ఆకివీడు పట్టణంలో. అయితే చలో ఆకివీడు అంటూ సోషల్ మీడియాలో పిలుపు ఎవరు ఇచ్చారో తెలియడం లేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది.
శ్రీరామనవమి నాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఆకివీడు పట్టణంలోని ఓ రామాలయంలో.. రాముడి విగ్రహానికి పూలమాలలు వేసేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే అక్కడ ఆలయానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. దీంతో స్థానికులు కొందరు రఘురామకృష్ణంరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అడ్డుకున్నారు. అయితే మేకులతో పాటు కొన్నిరకాల ఆయుధాలతో దాడికి ప్రయత్నం చేశారు. దీంతో చాలామంది కూటమినేతలు గాయపడ్డారు. అయితే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణం రాజు పై దాడిని ప్రతి ఒక్కరు ఖండించారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ యాక్షన్ లోకి దిగింది. 21 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది.
అయితే అక్కడ పరిస్థితుల దృష్ట్యా పోలీస్ శాఖ ప్రత్యేక శిబిరాలను కొనసాగిస్తూ వస్తోంది ఆకివీడు పట్టణంలో. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో చలో ఆకివీడు అంటూ ఎవరో సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. అయితే రఘురామకృష్ణంరాజు నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. ఆయన ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. అటు ఏ సంఘాలు కూడా బాహటంగా ప్రకటనలు చేయలేదు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు ఆకివీడు పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ పరిణామాలతో ఆకివీడు పట్టణంలో ఆందోళన నెలకొంది.