Donald Trump Stock Market Impact 2026: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మరోసారి స్టాక్ మార్కెట్ల జోరును పెంచాయి. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధానికి సంబంధించిన శాంతి చర్చలు మరోసారి జరగవచ్చని ట్రంప్ ఇటీవల ప్రకటన చేశారు. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ఆశాజనక వాతావరణాన్ని సృష్టించినట్లయింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశముండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. కీలక సూచీ BSE Sensex ప్రారంభ ట్రేడింగ్లోనే 1300 పాయింట్లకు పైగా లాభపడి పెట్టుబడిదారులను ఉత్సాహపరిచింది.
ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 9.26 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 1211 పాయింట్లు ఎగబాకి 78,059 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో Nifty 50 కూడా 367 పాయింట్లు లాభపడి 24,209 స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో ప్రముఖ కంపెనీల షేర్లు గణనీయంగా లాభాల్లో పయనిస్తున్నాయి . Hindalco Industries, InterGlobe Aviation, Shriram Finance, Infosys, Tata Consultancy Services వంటి సంస్థల షేర్లు కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతో పెరుగుదల చూపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు స్థిరపడతాయన్న అంచనాలతో ఐటీ, మెటల్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
అయితే మరోవైపు కొన్ని స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా Dr. Reddy’s Laboratories, Oil and Natural Gas Corporation, Coal India షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, రంగాల వారీగా లాభాల బుకింగ్ వంటి కారణాలు ఈ స్టాక్స్పై ప్రభావం చూపుతున్నాయి.మొత్తంగా అమెరికా–ఇరాన్ శాంతి చర్చలపై వచ్చిన సానుకూల సంకేతాలు గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ తగ్గిందన్న భావనను కలిగించాయి. దీని ప్రభావంగా భారత మార్కెట్లు బలంగా పెరుగుతున్నాయి. అయితే పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాలు, చర్చల ఫలితాలపై అప్రమత్తంగా ఉండటం అవసరం. మార్కెట్లో ఈ ఉత్సాహం కొనసాగుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో వెలువడే వార్తలపై ఆధారపడి ఉంటుంది.
మరోవైపు హర్మోజ్ ను తాము పూర్తిగా దిగ్బంధించామని, ఓడరేవుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో యుద్ధం ముగిపోనుందని ట్రంప్ ప్రకటించారు. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
