Homeఅంతర్జాతీయంPakistan Afghanistan: పాకిస్తాన్‌ దొంగదెబ్బ.. నెత్తురొడిన ఆఫ్గాన్‌ సరిహద్దు!

Pakistan Afghanistan: పాకిస్తాన్‌ దొంగదెబ్బ.. నెత్తురొడిన ఆఫ్గాన్‌ సరిహద్దు!

Pakistan Afghanistan: పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ మధ్య ఇటీవల తాత్కాలిక శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ఇరు దేశాల మధ్య పరస్పరదాడులు ఆగిపోయాయి. అంతకుముందు టీటీపీ(తెహ్రీక ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌) సంస్థ ఉగ్రవాదులు లక్ష్యంగా పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌పై దాడులు చేసింది. వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు మరణించారు. ఆఫ్గాన్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ప్రతిదాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లో నష్టం జరిగింది. ఖతార్‌ చొరవతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. తాజాగా పాకిస్తాన్‌ అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చింది. కానీ పాకిస్తాన్‌ వైమానిక దళం ఆఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలపై అర్ధరాత్రి దాడులు చేపట్టింది. పక్తికా, పక్తియా, కునార్‌ ప్రాంతాల్లో జరిగిన ఈ చర్యల్లో మొదటి దశలో జనావాసాలు, మసీదులు లక్ష్యంగా మారాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే రెండో దశ దాడులు జరగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. స్థానిక వర్గాల ప్రకారం, 25 నిమిషాల వ్యవధిలో రెండు దశల్లో దాడులు జరిగాయి.

35 మంది మృతి.. వందకు పైగా క్షతగాత్రులు.

ఈ దాడుల్లో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌ వైపు ఈ మృతులంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులని పేర్కొంటోంది. అయితే ఆఫ్గాన్‌ అధికారులు మాత్రం మృతుల్లో ఎక్కువ మంది అమాయక పౌరులే ఉన్నారని, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెబుతున్నారు. గాయపడిన వారి సంఖ్య వందకు మించిందని సమాచారం.

పాకిస్తాన్‌ సమర్థన.. ఆఫ్గాన్‌ తీవ్ర నిరసన
పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ చర్యలను ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఆపరేషన్లుగా సమర్థించుకుంటోంది. దేశంలో ఇటీవల జరిగిన దాడులకు ప్రతిస్పందనగా టీపీపీ అనుబంధ గ్రూపులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వాదిస్తున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్‌ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, పౌర ప్రాంతాలపై జరిగిన దాడులను ‘‘అక్రమ చర్యలు’’గా అభివర్ణించింది.

డబుల్‌ ట్యాప్‌ వ్యూహం..
మొదటి దాడి తర్వాత సహాయక బృందాలు, వైద్య సిబ్బంది చేరుకునే సమయంలోనే రెండోసారి దాడి జరగడం వల్ల ‘‘డబుల్‌ ట్యాప్‌’’ వ్యూహం అమలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మానవ హక్కుల సంస్థలు ఈ పద్ధతిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాల్లో ఇది ప్రత్యేకంగా నిషేధించబడకపోయినా, జెనీవా కన్వెన్షన్‌ స్పిరిట్‌కు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి.

2021 తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు నిరంతరం దెబ్బతింటున్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా పూర్తి స్థాయిలో నిలబడలేకపోయాయి. తాజా ఘటనలతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళన వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular