Pahalgam Terror Attack Pakistan Bank Finance: బ్యాంకులు.. వ్యాపారానికి, వ్యవసాయానికి, ఇళ్ల నిర్మాణానికి, వాహనాల కొనుగోలుకు సాధారణంగా ఫైనాన్స్ చేస్తుంటాయి. కానీ ఉగ్రదేశం.. పాకిస్తాన్లోని బ్యాంకులు మాత్రం ఇందుకు భిన్నం. పై వాటికి రుణాలు ఇవ్వడంతోపాటు భారత్పై దాడిచేసే ఉగ్రవాదులకు కూడా ఫైనాన్స్ చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడిలో ఉపయోగించిన మొబైల్ ఫోన్ల కొనుగోలు, దిగుమతి లావాదేవీలకు పాకిస్తాన్లోని ఫైసల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసినట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి.
ఉగ్రదాడులకు ఫైనాన్సింగ్..
ఉగ్రవాద ఫైనాన్సింగ్లో బ్యాంకింగ్ సంస్థల పాత్రపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫోన్ల ట్రయిల్ ద్వారా బ్యాంక్ సంబంధందాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు షావోమి హ్యాండ్సెట్ల దిగుమతి వివరాలు పరిశీలించగా ఈ లింక్ బయటపడింది. కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2021లో ఈ ఫోన్ల కన్సైన్మెంట్ను దిగుమతి చేసుకుంది. ఆ లావాదేవీలకు ఫైసల్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఈ దాడిలో బ్యాంక్ నేరుగా పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఫోన్లు మాత్రమే బ్యాంక్ ఫైనాన్స్ ద్వారా వచ్చాయని, మరిన్ని విషయాలు దర్యాప్తు చేస్తున్నారు.
ఉగ్రవాది వద్ద ఫోన్లు లభ్యం..
పహల్గాం దాడిలో పాల్గొన్న ఫైసల్ జాట్ అనే ఉగ్రవాది తన వద్ద రెండు షావోమి ఫోన్లను (రెడ్మీ 9టి, నోట్ 12) ఉంచుకున్నాడు. ఈ ఫోన్లు 2021, 2023లో దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దాడి జరిగే వరకు ఈ ఫోన్లను ఎక్కడా ఆన్ చేయలేదు. ఎంపిక చేసిన ఉగ్రవాదులకు అప్పగించేందుకు మాత్రమే సిద్ధంగా ఉంచి, స్విచ్ ఆఫ్ స్థితిలోనే భద్రపరచి ఉంచారని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.
ఫైసల్ బ్యాంక్పై పాత్ర ఆరోపణలు
ఫైసల్ బ్యాంక్ పేరు ఇది మొదటి సారి కాదు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది. లష్కర్–ఎ–తయ్యిబా, లజ్నత్ అల్ దవా వంటి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు, అల్–ఖైదాతో ముడిపడిన ఒక కువైట్ సంస్థ ఈ బ్యాంక్తో లావాదేవీలు చేసినట్లు వివరాలు ఉన్నాయి. 2007లో ఒక అమెరికన్ పత్రిక ఈ బ్యాంక్లో ఉగ్ర సంస్థల డిపాజిట్ల గురించి రిపోర్ట్ చేసింది.
ఉగ్ర ఫైనాన్సింగ్లో బ్యాంకుల పాత్రఈ సమాచారం ఉగ్రవాదులు ఎలా అధునాతన సాంకేతిక సాధనాలను ఉపయోగించి దాడులు చేస్తున్నారో చూపిస్తోంది. ఫోన్లను దీర్ఘకాలం స్విచ్ ఆఫ్లో ఉంచడం ద్వారా ట్రాకింగ్ను నివారించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్లోని బ్యాంకింగ్ వ్యవస్థ ఉగ్రవాద ఫైనాన్సింగ్కు మార్గాలు అందిస్తున్నదా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఫైసల్ బ్యాంక్ కేసు కేవలం ఒక ఫోన్ దిగుమతి మాత్రమే కాకుండా, ఉగ్ర సంస్థలతో దీర్ఘకాలిక సంబంధాలను సూచిస్తోంది. భారత్తోపాటు అంతర్జాతీయ సంస్థలు ఈ బ్యాంక్, ఇలాంటి లావాదేవీలపై కఠిన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
