POK Freedom Movement: కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా ప్రచారం చేసి, భారత్పై పాకిస్తాన్ నరేటివ్ను బలపరచడంలో కీలక పాత్ర పోషించిన మీర్పురి ముస్లింలు ఇప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవకే)లో సైన్యం చేస్తున్న అత్యాచారాలు, ఇంటర్నెట్ నిషేధం, సామాన్య ప్రజలపై హింసను హైలైట్ చేస్తూ లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట తీవ్ర ఆందోళనలు చేశారు. ఇది పాకిస్తాన్కు పెద్ద షాక్గా మారింది.
ఎవరీ మీర్పురి ముస్లింలు..
1947లో కశ్మీర్ సమస్య మొదలు కావడానికి ఐదారేళ్ల ముందు నుంచే లండన్లో మీర్పూర్ నుంచి వచ్చిన శరణార్థులు(మీర్పురి ముస్లింలు) పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నరేటివ్ను బలపరుస్తూ వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన ఈ వారిని బ్రిటిషర్లు లండన్లో స్థిరపరచారు. గత దశాబ్దాలుగా వీరు పాకిస్తాన్ జెండాలు ఎగురవేసి భారత్ను తిట్టడం, భారత రాయబార కార్యాలయాలపై దాడులు, బ్రిటిష్ పార్లమెంట్లో కశ్మీర్ విషయం లేవనెత్తడం వంటి చర్యలతో పాకిస్తాన్కు అనుకూల వాతావరణం సృష్టించారు.
పీవోకేలో తిరుగుబాటు..
గిల్గిట్బల్టిస్తాన్, మీర్పూర్, పోక్ ప్రజలు 2020 నుంచి హక్కుల కోసం పోరాడుతున్నారు. గోధుమ పిండి, విద్యుత్ ధరలు, రోడ్లు, సాగునీరు, అభివృద్ధి పనులు వంటి సమస్యలతో మొదలైన ఉద్యమం 2023లో తీవ్రమైంది. 2024లో 6 రోజులు, 2025లో నెల రోజులు పూర్తి షట్డౌన్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలు జరిపి హామీలు ఇచ్చినా, కనీస హక్కులు కూడా అమలు చేయలేదు. ఇటీవలి ఘర్షణల్లో పోలీసు–సైన్యం కాల్పులు జరిపి పలువురు మరణించారు. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలపై పూర్తి నిషేధం విధించడంతో పీవోకేలోని ప్రజలు బంధువులతో కూడా సంప్రదించలేకపోతున్నారు.
లండన్లో ఆందోళన..
ఇప్పటి వరకు భారత్పై ఆందోళనలు చేసిన మీర్పురి ముస్లింలు తాజాగా పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట ‘పీవోకేను విముక్తం చేయాలి అంటూ నినాదాలు చేశారు. తమ బంధువుల సమాచారం తెలుసుకోలేకపోతున్నామని, సైన్యం అత్యాచారాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కమ్యూనిటీ బ్రిటిష్ రాజకీయాల్లో బలమైన పట్టు కలిగి ఉంది. సుమారు 50 మంది ఎంపీల గెలుపు–ఓటముల్లో వీరి ఓట్లు కీలకం. ఇటీవల 50 మంది ఎంపీలకు మెమోరాండం సమర్పించి, పీవోకేలో జరుగుతున్న అత్యాచారాలను పార్లమెంట్లో లేవనెత్తి, ఇంటర్నెట్ నిషేధం ఎత్తివేయాలని ఒత్తిడి తెచ్చారు.
పాకిస్తాన్ దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో భారత్ను ఇరుకున పెట్టడానికి ఉపయోగించిన ఆయుధం(మీర్పురి డయాస్పోరా) ఇప్పుడు తనకే వ్యతిరేకంగా తిరగడం పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ. పీవోకేలో తిరుగుబాటు, బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమం ఇవన్నీ కలిసి పాకిస్తాన్ను బహుముఖ సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. సొంత ఇంట్లోనే మండుతున్న అగ్ని ప్రపంచ వ్యాప్తంగా ధ్వనిస్తోంది.

