Iran attack on Pakistan oil tanker: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను తెరపైకి తెచ్చారు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఎవరి పక్షాన నిలవలేదు. తటస్తంగా ఉండిపోయింది. దీంతో యుద్దం ఆపేందుకు దాడులు నిలిపివేసిన ట్రంప్ 15 అంశాలతో ఇరాన్కు పాకిస్తాన్ ద్వారా ప్రతిపాదనలు చేశారు. పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చింది. కానీ ఈ సమయంలో ఇరాన్ పాకిస్తాన్కు వరుసగా షాక్లు ఇస్తోంది. మొదట పాకిస్తాన్ చమురు నౌక హర్మూజ్ దాటకుండా అడ్డుకుంది. ముందస్తుగా సముద్ర అనుమతి తీసుకోలేదని నిలిపివేసింది. ఈ చర్య మధ్యవర్తిత్వానికి ఆటంకంగా మారుతుందని భావించారు. కానీ అనుమతి తర్వాత నౌక హర్మూజ్ దాటింది. కానీ తాజాగా పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చింది ఇరాన్. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్కు చెందిన చమురు ట్యాంకర్ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేల్చివేసింది. దుబాయ్, అబుదాబీ సముద్ర తీర ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్తాన్ బీరాలు పలుకుతున్న వేళ ఈ దాడి జరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అనుమతి లేకుండా హర్మూజ్ దాటేందుకు..
రెండు రోజుల క్రితమే హర్మూజ్లో పాకిస్తాన్ నౌకను ఇరాన్ అడ్డుకుంది. అనుమతి లేకుండా జలసంధి దాటేందుకు ప్రయత్నించడంతో దానిని నిలిపివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. తాజాగా మరో పాక్ చమురు నౌకపై క్షిపణులతో దాడి చేసి, పూర్తిగా ధ్వంసం చేసింది. నౌకకు మంటలు అంటుకుని, సిబ్బంది గల్లంతయ్యారని అనుమానిస్తున్నారు. అయితే అధికారికంగా మరణాల సంఖ్య వెల్లడి కాలేదు.
చర్చలకు వ్యతిరేకంగా దాడి..?
ఇరాన్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. ప్రధాని షహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ మేరకు ప్రకటనలు చేశారు. కానీ ఈ నేపథ్యంలోనే పాక్ నౌకపై ఇరాన్ దాడి చేయడం గమనార్హం. ఇరాన్ చర్చలకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. అందుకే దాడులకు తెగబడుతోందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తోంది. అమెరికా సైన్యం తమ దేశంలో దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది.
Also Read: మోదీ.. ట్రంపు.. మధ్యలో మస్క్.. ఫోన్ సంభాషణలో అసాధారణ పరిణామం!
ఇరాన్ కఠిన నిబంధనలు
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ హర్మూజ్ జలసంధిని తన ఉక్కుపిడికిట్లోకి తీసుకుంది. నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించాలంటే ఇరాన్ అధికారులతో ముందస్తు సమన్వయం చేసుకోవాలి, అనుమతి లేనిదే ప్రవేశం ఉండదని నిబంధన విధించింది. శత్రుదేశాల నౌకలను వదలబోమని, మిత్రదేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తామని ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి మాజిద్ తఖ్త్ రవంచి తెలిపారు. భారత్కు చెందిన నౌకలకు ఇరాన్ అనుమతిస్తోంది, కానీ పాకిస్తాన్ నౌకలపై దాడులు చేస్తోంది.
ఇరాన్–పాక్ సంబంధాలకు బీటలు..
ఇరాన్–పాకిస్థాన్ సంబంధాలు సరిహద్దు భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. గతంలో 9/11కి ముందు ఆఫ్ఘన్ తాలిబన్కు పాకిస్తాన్ మద్దతు ఇరాన్తో సంబంధాలను బలహీనపరిచింది. బలూచిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాదుల ఉద్యమాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. 2026 జనవరిలో ఇరాన్ పాకిస్తాన్పై మెరుపుదాడి చేసి, కరాచీ ఎయిర్పోర్టు వద్ద నౌకపై దాడి చేసింది. తాజా ఘటనతో ఈ విభేదాలు మరింత ముదురుతున్నాయి.
ఈ దాడితో పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందని ఆ దేశ మంత్రులే ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లో ప్రభుత్వ మార్పు జరిగితే భారత్కు దెబ్బ. పాకిస్తాన్, చైనాలకు లాభం కలుగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Just in Breaking
Iran destroys Pakistan oil tanker that attempted to pass through the Strait of Hormuz without permission…..See more pic.twitter.com/kvYfaniJeJ
— INN Iran National News (@INNewx) March 27, 2026