Countries closing embassies in Pakistan: పాకిస్తాన్తో ప్రపంచ దేశాలు తెగదెంపులు చేసుకుంటున్నాయి. ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం.. మరోవైపు పాకిస్తాన్తో ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉందన్న అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్టుతో పాకిస్తాన్లోని పలు దేశాలు తమ కార్యాలయాను మూసివేస్తున్నాయి. తలుపులకు తాళాలు వేసి, దౌత్య సిబ్బంది వెళ్లిపోతున్నారు. ఇటీవల అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరగడం, ఒకటిరెండు మినహా మిగతా చోట్ల కార్యకలాపాలు నిలిపివేయడం ఈ పతనానికి నిదర్శనం. కరాచీలోని అమెరికా కాన్సులేట్ను పూర్తిగా మూసివేశారు. తాజాగా ఫిన్లాండ్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికా కార్యాలయాలపై దాడులు..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాకిస్తాన్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్పై నిరసనకారులు దాడి చేసి, భవనానికి నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో 9–12 మంది పాకిస్తానీలు మృతి చెందారు, అమెరికా మెరైన్ గార్డ్స్ కాల్పులు జరిపారు. దీంతో అమెరికా తన కార్యకలాపాలను నిలిపివేసి, కరాచీ కార్యాలయాన్ని మూసివేసింది. ఇస్లామాబాద్, పెషావర్లలో కూడా నిరసనల భయంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఫిన్లాండ్ షాక్..
ఫిన్లాండ్ ప్రభుత్వం పాకిస్తాన్లోని తన రాయబార కార్యాలయాన్ని 2026లో మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. పాకిస్తాన్ రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, మాతో పరిమిత వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఇందుకు కారణం‘ అని ఫిన్లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది. ఇది కేవలం పాకిస్తాన్కే పరిమితం కాదు. ఆఫ్ఘనిస్తాన్ (కాబూల్), మయన్మార్ (యాంగోన్)లలో కూడా ఫిన్లాండ్ ఎంబసీలను మూసివేస్తున్నారు. 2012లో బడ్జెట్ పరిమితుల కారణంగా పాకిస్తాన్ ఎంబసీని మూసేసిన ఫిన్లాండ్, 2022లో మళ్లీ ప్రారంభించింది. ఇప్పుడు 2026లో మళ్లీ మూసివేయడం గమనార్హం.
పాకిస్తాన్లో అనుకూల పరిస్థితులు లేక..
పాకిస్తాన్లో అనుకూల పరిస్థితులు లేకపోవడమే విదేశీ దేశాలు వెనుదిరగడానికి ప్రధాన కారణం. ఉగ్రవాద దాడులు, మతపరమైన హింస, రాజకీయ అస్థిరత విదేశీ దౌత్య సిబ్బందికి ముప్పుగా మారాయి. పాకిస్తాన్ దివాలా తీసే పరిస్థితిలో ఉండటం, విదేశీ మారకాల రిజర్వులు తగ్గడం వాణిజ్య సంబంధాలను దెబ్బతీశాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు వీసాలు నిరాకరిస్తున్నాయి. భిక్షాటన, నేరాల కారణంగా పాకిస్తాన్పై వ్యతిరేకత పెరిగింది. ఇరాన్–అమెరికా యుద్ధం పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. దౌత్య సంబంధాలు దెబ్బతినడం, రాయబార కార్యాలయాలపై దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఏం జరుగుతోంది?
కరాచీ కాన్సులేట్ను అమెరికా మూసివేసింది. ఇస్లామాబాద్ ఎంబసీలో పరిమిత సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఫిన్లాండ్ పూర్తిగా మూసివేత, హ్యూస్టన్ (అమెరికా)లో కొత్త కాన్సులేట్ తెరవడం ద్వారా వ్యూహాత్మక మార్పు చేసింది. ఇతర ఐరోపా దేశాలు కూడా భద్రతా కారణాలతో సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. విదేశీ రాయబార కార్యాలయాల మూసివేత పాకిస్తాన్కు పెద్ద షాక్. దౌత్యపరంగా ఏకాంతమవుతున్న పాకిస్తాన్, అంతర్జాతీయ వేదికలపై తన గొంతు వినిపించుకోలేని పరిస్థితిలో పడింది. ఆర్థిక సహాయం, వాణిజ్య ఒప్పందాలు, వీసా సౌకర్యాలు దెబ్బతినడం ఖాయం.
పాకిస్తాన్ ప్రభుత్వం భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చుకుని, విదేశీ దేశాలతో సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది. లేకపోతే, మరిన్ని ఎంబసీలు మూతపడి, పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరింత ఏకాంతమయ్యే ప్రమాదం ఉంది.
