Homeఅంతర్జాతీయంChina Water Bomb : చైనా ‘వాటర్‌ బాంబ్‌’.. భారత్‌కు ముప్పు తప్పదా?

China Water Bomb : చైనా ‘వాటర్‌ బాంబ్‌’.. భారత్‌కు ముప్పు తప్పదా?

China Water Bomb : తాను ఆర్థికంగా ఎదగాలంటే.. ఇంకొకరిని తొక్కాలి.. అనేది డ్రాగన్‌ కంట్రీ చైనా ఫార్ములా. చాలాకాలంగా ఈ సూత్రంతోనే ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతూ వస్తోంది. తాజాగా ఆసియాలో తనకు ప్రమాదకరంగా మారిన భారత్‌ను తన దరిదాపుల్లోకి రాకుండా చేసేందుకు, అగ్రరాజ్యం అమెరికాను వెనక్కు నెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత ఎదుగుదలను చైనా సహించలేకపోతోంది. ఈ క్రమంలో భారత వ్యతిరేక దేశాలతో కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. తాజాగా టిబెట్‌–నేపాల్‌ […]

China Water Bomb : తాను ఆర్థికంగా ఎదగాలంటే.. ఇంకొకరిని తొక్కాలి.. అనేది డ్రాగన్‌ కంట్రీ చైనా ఫార్ములా. చాలాకాలంగా ఈ సూత్రంతోనే ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతూ వస్తోంది. తాజాగా ఆసియాలో తనకు ప్రమాదకరంగా మారిన భారత్‌ను తన దరిదాపుల్లోకి రాకుండా చేసేందుకు, అగ్రరాజ్యం అమెరికాను వెనక్కు నెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత ఎదుగుదలను చైనా సహించలేకపోతోంది. ఈ క్రమంలో భారత వ్యతిరేక దేశాలతో కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది. తాజాగా టిబెట్‌–నేపాల్‌ సరిహద్దుల్లో ఇటీవలి ఆకస్మిక వరదలు 162 మంది ప్రాణాలు తీశాయి. ఈ విపత్తు హిమాలయ ప్రాంతంలోని భూకంప, హిమనదీ కూలిపోవడం వంటి ప్రమాదాలను మళ్లీ గుర్తు చేసింది. అదే సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలోని మెడోగ్‌ కౌంటీలో యార్లంగ్‌ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై చైనా నిర్మిస్తున్న 60 వేల మెగావాట్‌ సామర్థ్యం గల భారీ డ్యామ్‌ ప్రాజెక్టు భారత్‌కు ‘వాటర్‌ బాంబ్‌’గా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టుతో భారత్‌కు అనేక రకాలుగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు..
ఈ మెడోగ్‌ హైడ్రోపవర్‌ స్టేషన్‌ యార్లంగ్‌ త్సాంగ్పో నది గ్రేట్‌ బెండ్‌ ప్రాంతంలో నిర్మితమవుతోంది. నది ఇక్కడ నమ్చా బర్వా పర్వతం చుట్టూ పెద్ద యూ–టర్న్‌ తీసుకుని అరుణాచల్‌లోకి సియాంగ్‌గా ప్రవేశిస్తుంది. తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది. ఈ నదిపై ప్రతిపాదిత సామర్థ్యం సుమారు 60 గిగావాట్లు. ఇది చైనా త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. వార్షిక విద్యుత్‌ ఉత్పత్తి సుమారు 300 బిలియన్‌ కిలోవాట్‌ ఫర్‌ అవర్స్‌కు చేరుతుందని అంచనా. ఖర్చు 137 బిలియన్‌ నుంచి 170 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. 2024 చివరలో ఆమోదం పొంది, 2025లో నిర్మాణం ప్రారంభమైంది. ఐదు క్యాస్కేడ్‌ స్టేషన్లతో కూడిన ఈ ప్రాజెక్టు చైనా గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలకు, తూర్పు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాకు ఉపయోగపడుతుందని బీజింగ్‌ చెబుతోంది.

నిజమైన ప్రమాదం ఇక్కడే
ఈ ప్రాంతం హిమాలయాల్లో అత్యధిక భూకంప ప్రమాదం ఉన్న జోన్‌–5లో ఉంది. ఇటీవల చైనా భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం (స్టేట్‌–రన్‌ జియోలాజికల్‌ సర్వే సంబంధిత) ప్రకారం, ప్రాజెక్టు సైట్‌ కింద యాక్టివ్‌ పైజెన్‌ ఫాల్ట్‌ ఉంది. ఈ ఫాల్ట్‌ ప్లీస్టోసీన్‌ కాలం నుంచి చురుకుగా ఉంది. 2017లో 6.9 తీవ్రత గల భూకంపం ఇక్కడే నమోదైంది. శిలలు బలహీనంగా, స్లోప్‌లు అస్థిరంగా ఉన్నాయని హెచ్చరికలు ఉన్నాయి. రిజర్వాయర్‌ నీరు నింపితే భూమి ఒత్తిడి పెరిగి రిజర్వాయర్‌–ట్రిగ్గర్డ్‌ సీస్మిసిటీకి దారితీయవచ్చు. భూకంపం లేదా కొండచరియలు కూలితే డ్యామ్‌ దెబ్బతిని, భారీ నీటి ప్రవాహం దిగువకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇటీవలి నేపాల్‌–టిబెట్‌ వరదలు హిమనదీ కూలిపోవడం వల్ల సంభవించాయి. ఈ ప్రాంతంలో చిన్న సంఘటన కూడా ఎంత విధ్వంసం చేస్తుందో చూపించాయి.

భారత్‌కు పొంచిఉన్న ముప్పులు..
చైనా ఏకపక్షంగా నీటిని నిలిపివేస్తే పొడి కాలంలో ప్రవాహం తగ్గి, వర్షాకాలంలో అకస్మాత్తుగా వదిలితే అస్సాం, అరుణాచల్‌లో వరదలు తీవ్రమవుతాయి. అస్సాంలో ఇప్పటికే 40 శాతం భూమి వరద ప్రభావితం అవుతుంది.. యార్లంగ్‌ త్సాంగ్పో బ్రహ్మపుత్ర ప్రవాహంలో గణనీయమైన భాగం. దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీరు, పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. సెడిమెంట్‌ ప్రవాహం తగ్గితే నదీ తీరాలు కోతకు గురవుతాయి. జీవవైవిధ్యం, మట్టి సారం ప్రభావితం అవుతాయి. బంగ్లాదేశ్‌కు కూడా ప్రమాదం. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో నీటిని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ, వ్యూహ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2022 నుంచి డేటా పంచుకోకపోవడం మరింత ఆందోళన పెంచింది.

భారత్‌ చేపట్టాల్సిన చర్యలు..
భారత్‌ సైతం అప్పర్‌ సియాంగ్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టు వంటి కౌంటర్‌ డ్యామ్‌లను పరిగణిస్తోంది. కానీ డ్యామ్‌–ఫర్‌–డ్యామ్‌ విధానం కూడా భూకంప, పర్యావరణ ప్రమాదాలు తెస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో హైడ్రాలజికల్‌ డేటా పంచుకోవడం, ఉమ్మడి పర్యావరణ అంచనాలు, ట్రాన్స్‌బౌండరీ నీటి ఒప్పందాల కోసం ఒత్తిడి పెంచాలి. చైనా అంతర్జాతీయ నీటి ఒప్పందాలకు కట్టుబడి లేదు కాబట్టి దౌత్యపరమైన ఒత్తిడి కీలకం.

ఇటీవలి వరదలు హిమాలయాల్లోని సహజ ప్రమాదాలను గుర్తు చేశాయి. అలాంటి ప్రాంతంలో భారీ డ్యామ్‌ నిర్మాణం జరుగుతుంటే భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. ఇది కేవలం విద్యుత్‌ ప్రాజెక్టు కాదు.. దిగువ ప్రాంతాల జీవనాధారం, భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సమస్య. పారదర్శకత, సహకారం లేకపోతే ఈ ‘వాటర్‌ బాంబ్‌’ నిజంగా పేలే ప్రమాదం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper