Charlie Kirk Assassination: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అదేశంలో అన్నీ ఉల్టా.. పుల్టా జరుగుతున్నాయి. ట్రంప్కు ముందు వరకు ప్రపంచంలో చాలా దేశాలతో సత్సంబంధాలు కొనసాగాయి. ట్రంప్ రాకతో అనేక దేశాలు అమెరికాకు శత్రువుగా మారాయి. ట్రంప్ టారిఫ్ ప్రభావంతో చాలా దేశాలు దూరమయ్యాయి. ఇక ప్రపంచ సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్ నంబర్ వన్ స్థానం కోల్పోయాడు. తాజాగా ట్రంప్ స్నేహితుడు హత్యకు గురయ్యాడు. అమెరికా రాజకీయ కార్యకర్త, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ (31) ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు, దీనిని ‘రాజకీయ హత్య‘గా ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ వర్ణించారు. ఈ సంఘటన అమెరికాలో పెరిగిపోతున్న రాజకీయ హింస గురించి మరోసారి ఆందోళన కలిగించింది.
యువతను సమీకరించిన రాజకీయ కార్యకర్త
చార్లీ కిర్క్, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను 18 ఏళ్ల వయసులో స్థాపించి, అమెరికా యువతలో సంప్రదాయవాద భావజాలాన్ని ప్రచారం చేశారు. కళాశాలల్లో లిబరల్ ఆలోచనలకు వ్యతిరేకంగా వివాదాస్పద చర్చలు నిర్వహించడం ద్వారా ఆయన గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ సన్నిహిత సహచరుడిగా, ట్రంప్ 2024 ఎన్నికల్లో యువ ఓటర్లను సమీకరించడంలో కిర్క్ కీలక పాత్ర పోషించారు. ఆయన ‘ది చార్లీ కిర్క్ షో‘ పాడ్కాస్ట్, సేలం రేడియో కార్యక్రమం ద్వారా లక్షలాది మంది అనుచరులను సంపాదించారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో సన్నిహిత సంబంధం, ట్రంప్ పరిపాలనలో సిబ్బంది నియామకాల్లో కిర్క్ ప్రభావం స్పష్టం. అయితే, ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యంగా జాతి, వలసలపై విమర్శలకు గురయ్యాయి.
టార్గెట్ దాడితో హతం..
సెప్టెంబర్ 10, 2025న ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో ‘అమెరికన్ కమ్బ్యాక్ టూర్‘లో భాగంగా కిర్క్ ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఆయన మెడ భాగంలో ఒకే ఒక బుల్లెట్తో కాల్చారు. ఇది సుమారు 180–200 మీటర్ల దూరంలోని లోసీ సెంటర్ భవనం పైకప్పు నుంచి జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనను ‘టార్గెట్ దాడి‘గా ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ కమిషనర్ బ్యూ మాసన్ వర్ణించారు. కిర్క్ ఆసుపత్రికి తరలించినా గాయాల తీవ్రత కారణంగా మరణించారు. సంఘటన సమయంలో సుమారు 3 వేల మంది ఉన్నారు.
దొరకని నిందితుడు..
ఈ హత్యకు గల కారణం, నిందితుడి గుర్తింపు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇద్దరు వ్యక్తులను ప్రారంభంలో అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారికి ఈ దాడితో సంబంధం లేదని తేల్చి విడుదల చేశారు. ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో నలుపు రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి పైకప్పుపై కనిపించినట్టు అధికారులు పేర్కొన్నారు, కానీ ఫుటేజీ నాణ్యత తక్కువగా ఉండటంతో గుర్తింపు కష్టంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం, ఫొటోలు, వీడియోలను పంచుకోవాలని ఎఫ్బీఐ ప్రజలను కోరింది.
ట్రంప్ ఇజ్జత్ పాయె..
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒకవైపు వివాదాస్పదమవుతున్నాయి. ఇంకోవైపు అమెరికాలో హింస పెరుగుతోంది. తాజాగా ట్రంప్ సన్నిహితుడే హత్యకు గురికావడం ట్రంప్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. 2024లో ట్రంప్పై రెండు హత్యాయత్నాలు, మిన్నెసోటాలో డెమోక్రాటిక్ రాష్ట్ర శాసనసభ్యురాలు హత్య వంటి ఘటనలు ఈ ధోరణిని సూచిస్తున్నాయి. చార్లీ కిర్క్ హత్యను ఉటా గవర్నర్ కాక్స్ ‘రాజకీయ హత్య‘గా అభివర్ణించడం, ఈ ఘటన స్వేచ్ఛా వాక్కు, చర్చలకు గల హక్కును హరించే ప్రమాదంగా చూపింది. ట్రంప్, ఈ దాడికి ‘రాడికల్ లెఫ్ట్‘ వాదనలే కారణమని ఆరోపించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ దాడికి సంబంధించిన వారిని, సంస్థలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
The shot was so accurate, not possible for a Random left activist…
https://t.co/IZTAkZM02Y— Mr Sinha (@MrSinha_) September 11, 2025