Uttar Pradesh Woman : మన ఇళ్లల్లో ఆడవాళ్లు డబ్బులను పోపుల పెట్టె లోనో.. ఎవరికీ కనిపించని విధంగా డబ్బాలలోనో దాస్తారు. ఇంట్లో అత్యవసర పరిస్థితుల్లో డబ్బు లేనప్పుడు వాటిని బయటికి తీస్తారు. ఎందుకంటే పొదుపు అనేది ఆడవాళ్లకు జన్మతా వచ్చిన విద్య. అందువల్లే ఆడవాళ్లు ఆర్థిక రంగ వ్యవహారాలలో మగవాళ్ళతో పోల్చి చూస్తే అత్యంత మెరుగ్గా ఉంటారు. పైగా కుటుంబానికి సంబంధించి ఏదైనా ఆర్థిక సమస్య వస్తే వెంటనే ఉపాయాలు ఆలోచించి.. వాటిని పరిష్కరిస్తూ ఉంటారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ మాత్రం పై ఉపోద్ఘాతానికి భిన్నంగా ఆలోచించింది. డబ్బును పొదుపు చేసింది. భర్తకు తెలియకుండా దాచింది. వాటితో బంగారం కొనుగోలు చేయాలని అనుకుంది.. కానీ.. ఆమె ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది. భర్తకు తెలియకుండా భారీగా కూడబెట్టిన ఆమె.. చివరికి తల పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు భర్త దృష్టిలో ఆమె ఒక మోస గత్తే గా నిలిచిపోయింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గొండా ప్రాంతంలో ఓ మహిళ తన భర్తకు తెలియకుండా బంగారం కొనుగోలు చేయడానికి.. డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్ని సంవత్సరాలు పాటు కష్టపడి 12 లక్షలు కూడపెట్టింది. ఆ డబ్బు భర్త కంటపడకుండా ఉండేందుకు ట్రంక్ పెట్టెలో దాచింది. అయితే ఇటీవల బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో.. తన వద్ద ఉన్న డబ్బుతో బంగారం కొనుగోలు చేయాలని అనుకుంది. తాను దాచిన ట్రంక్ పెట్టెను బయటకి తీసింది. తాను దాచిన నగదు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆమెకు షాకింగ్ పరిణామం ఎదురైంది. ట్రంక్ పెట్టెలో దాచిన నగదును చూసిన ఆమెకు దిగ్భ్రాంతి కలిగింది. ఆ ట్రంక్ పెట్టెలో దాచిన నగదును ఎలుకలు కొరికాయ్. దాదాపు సగం నోట్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. బాగున్న నోట్లను.. చివర్లో చిరిగిన నోట్లను ఆమె సేకరించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనంగా మారాయి.
” భర్తకు తెలియకుండా డబ్బు దాచుకుంది. దాంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ బంగారం కూడా కొనుగోలు చేయలేకపోయింది. ఆమె దాచుకున్న నోట్లలో కొన్నింటిని ఎలుకలు కొరికేశాయి. ఇది ఆమెకు తీవ్ర నష్టాన్ని కలుగజేసిందని” స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పెట్టెలో చిన్నపాటి కన్నం ఉండడంతో ఎలుకలు అందులోకి ప్రవేశించాయి. అందులో ఉన్న కరెన్సీ నోట్లను కొరకడం మొదలు పెట్టాయి. ఆ ఎలుకలు చేసిన విధ్వంసం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.. అయితే ఇందులో సగం వరకు నోట్లు దేనికి పనికిరాకుండా పోయాయని తెలుస్తోంది.