Rajasthan Bullet Baba: ఎక్కడైనా దేవునికి గుడి కట్టి పూజలు చేయడం ఆనవాయితీ.. ఇటీవల అభిమాన నటులు, నాయకులకూ గుడి కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వారికి గుడి నిర్మిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పంచ భూతాలను కూడా పూజిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా రాజస్థాన్లో ఒక ’బైకు’కి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బైకుకి ఎందుకు గుడి కట్టారు అనే వివరాలు తెలుసుకుందాం.
ప్రమాదం..
1980 చివరలో ఓం సింగ్ రాథోడ్ అనే యువకుడు తనకు ఎంతగానో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్సైకిల్పై ప్రయాణించేటప్పుడు ఒక చెట్టుకు ఢీకొట్టి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పాలీ జిల్లాలోని చోటిలా గ్రామ సమీపంలో జరిగింది.
బుల్లెట్ బాబా..
ప్రమాదం జరిగిన తరువాత పోలీసులు ఆ బైకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెట్ బైక్ మరుసటి రోజు వెళ్లి ప్రమాదం జరిగిన చోటుకే చేరినట్లు తెలిసింది. ఇది ఎవరో ఆకతాయిల పని అని భావించి పోలీసులు మళ్లీ ఆ బైకుని స్టేషన్కు తీసుకెళ్లారు. మళ్లీ మునుపటి మాదిరిగానే ప్రమాదం జరిగిన చోటుకే చేరింది. ఈ సంఘటన మొదట్లో అందరిని భయానికి గురిచేసింది. ఆ తరువాత ఇందులో ఏదో దైవత్వం ఉందని గ్రహించి స్థానికులు ఓం సింగ్ రాథోడ్కు నివాళులర్పించాలని నిర్ణయించుకున్నారు.
ఆత్మ బుల్లెట్పై తిరుగుతుందని..
ఓం సింగ్ రాథోడ్ ఆత్మ బుల్లెట్ బైకు మీద తిరుగుతుందని భావించి స్థానికులు ప్రమాదం జరిగిన స్థలాన్నే స్థానికులు దేవాలయంగా మార్చారు. ఆ ప్రదేశంలో బుల్లెట్ బైకుకి పూజలు చేయడం ప్రారంభించారు. బుల్లెట్ మోటార్సైకిల్కు ఓం సింగ్ రాథోడ్ గౌరవార్థం ‘బుల్లెట్ బాబా’ అని పేరు పెట్టారు. ప్రతిరోజూ ఎంతో మంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
ప్రత్యేక పూజలు..
ఈ బుల్లెట్ బాబా ఆలయంలో అగరవత్తులు వెలిగించడం, మోటార్ సైకిల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, మద్యం పోయటం వంటివి అక్కడి ఆచారం. ఈ విధంగా చేస్తే భక్తులకు ప్రయాణ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఘాడంగా విశ్వసిస్తారు. ఈ గుడికి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు, సందర్శకులు వస్తుంటారు. కొంతమంది మోటార్సైకిల్దారులు, సాహస యాత్రికులు, ఆధ్యాత్మిక ఔత్సాహికులు తమ ప్రయాణ ప్రయాణంలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.