BPSC TRE 3 Paper Leak: ప్రశ్నపత్రాల లీక్ కొన్నేళ్లుగా దేశంలో సర్వసాధారణంగా మారింది. కొన్ని రాష్ట్రాలో పాఠశాల స్థాయి ప్రశ్నపత్రాలు లీక్ అవుతుంటే.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యో నియామకాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ చేస్తున్నారు. ఇటీవలే వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. తర్వాత మళ్లీ పరీక్ష నిర్వహించినా, పేపర్ లీక్పై సీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిహార్లో 2024లో జరిగిన బీపీఎస్సీ టీఆర్ఈ–3 ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో కొత్త పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించినట్లు భావిస్తున్న డాక్టర్ మనీష్ కుమార్ను రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం(ఈవోయూ) అరెస్టు చేసింది. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 296కు చేరింది.
వీడు సామాన్యుడు కాదు..
జెహనాబాద్ జిల్లాకు చెందిన ఈ వైద్యుడు 2021లో పట్నాలోని నలందా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గతంలో కైమూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసిన అనంతరం పదవిని వదిలి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దర్యాప్తులో అతని పేరు ముందుగా ఎఫ్ఐఆర్లో లేకపోయినా, విచారణ సమయంలో బయటపడింది.
ప్రశ్నపత్రాల లీక్ ఇలా..
2024, మార్చి 15న జరిగిన పరీక్షకు రెండు మూడు రోజుల ముందు దాదాపు 30 మంది అభ్యర్థులను పట్నా నుంచి జార్ఖండ్లోని హజారీబాగ్కు వాహనం ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. అక్కడి హోటల్లో వారికి లీక్ అయిన ప్రశ్నపత్రాలు చూపించి, సమాధానాలు గుర్తు పెట్టుకునే అవకాశం కల్పించారు. తర్వాత తిరిగి పట్నాకు తీసుకొచ్చారు. ఇందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.1.2 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.
లీక్ గ్యాంగ్తో సంబంధాలు
దర్యాప్తులో డాక్టర్ మనీష్కు పరీక్షల పేపర్ల లీక్ గ్యాంగ్తో సంబంధం ఉన్న డాక్టర్ శివ్తో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తేలింది. డాక్టర్ శివ్ పలు పరీక్షల లీక్ కేసుల్లో పేరెన్నికగన్న సంజీవ్ ముఖియా అలియాస్ లూటన్ కుమారుడు. సంజీవ్ ముఖియా గతంలో నీట్–యూజీ వంటి పరీక్షల లీక్లకు సంబంధించి ప్రస్తావనకు వచ్చినప్పటికీ, కొన్ని కేసుల్లో ఆధారాలు లేకపోవడంతో క్లీన్ చిట్ పొందాడు. ఈ నెట్వర్క్ ద్వారా అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించి నియామక ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
మనీష్ అరెస్టుతో దర్యాప్తులో పురోగతి..
మనీష్ను గత సోమవారం ఈవోయూ కార్యాలయానికి విచారణకు పిలిచిన తర్వాత గంటల తరబడి విచారించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈవోయూ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే వందలాది మంది అరెస్టయ్యారు. ఆర్థిక లావాదేవీలు, నెట్వర్క్ నిర్మాణం తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. అధికారులు మరిన్ని వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఈ కేసు బిహార్లో పోటీ పరీక్షల నిజాయితీపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.