Homeట్రెండింగ్ న్యూస్African Cheetah: ఆఫ్రికన్ చిరుతలను ఇండియాలో ఎలా కాపాడేది?

African Cheetah: ఆఫ్రికన్ చిరుతలను ఇండియాలో ఎలా కాపాడేది?

African Cheetah: ఇప్పటికే మొదటి దశలో ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చిన చీతాల్లో 9 కన్నుమూశాయి. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మిగతా చీతాలు కూడా అంతగా ఆరోగ్యంగా లేవని తెలుస్తోంది. ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చిన చీతాలు మన వాతావరణ పరిస్థితులకు అంతగా అలవాటు పడటం లేదని మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ వర్గాలు అంటున్నాయి. వీటిని చాలా రోజులపాటు ప్రత్యేక పరిస్థితులలో ఉంచినప్పటికీ.. అవి అంతగా ఇమడ లేకపోతున్నాయని పార్క్ వర్గాలు అంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ప్రచారం కోసం చీతాలను బలి పెడుతున్నారని కాంగ్రెస్ సహా చాలా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తమ హయాంలోనే ఆఫ్రికా నుంచి చీతాలను తెచ్చే ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉండగానే ఈ చీతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండవ దశ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈసారి కూడా ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా నుంచి భారత్ చీతాలను దిగుమతి చేసుకోనుంది. దక్షిణాఫ్రికా నుంచి మరో విడతగా చీతాలను తీసుకొచ్చి, మధ్యప్రదేశ్ లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలి పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది చివరిలో చీతాలు రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రెండవ ఏడాదిలో చీతాల సంతానోత్పత్తిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని అధికారులు చెబుతున్నారు. గతంలో దట్టమైన బొచ్చు పెరిగే చీతాలను తీసుకురావడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు ఎదురయ్యాయి. మూడు చీతాల మరణాలకు అదే ప్రధాన కారణమైందని అధికారులు అంటున్నారు. ఈసారి తీసుకొచ్చే చీతాల్లో వింటర్ కోటు లక్షణాలు లేని వాటిని ఎంపిక చేస్తామని, ఇవి భారత వాతావరణ పరిస్థితులకు సరిపోతాయని అధికారులు అంటున్నారు.

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ లోకి చీతాలు అడుగుపెట్టి ఈ ఆదివారంతో ఏడాది పూర్తయింది. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతలలో 20 చీతాలను తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో వదిలిపెట్టారు. ఇప్పటివరకు ఆరు చీతాలు, మూడు కూనలు మరణించాయి. స్థానిక వాతావరణం గురించి ఆలోచించకుండా, సరైన అవగాహన లేకుండా చీతాలను భారత్ తీసుకొచ్చారని విమర్శలున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రెండవ దశలో చీతాలను తీసుకు రావడం పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular