Homeట్రెండింగ్ న్యూస్Anand Mahindra: ఆనంద్ మహీంద్రా గొప్ప మనసు.. సర్ఫరాజ్ తండ్రికి సర్ "ప్రైజ్"

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా గొప్ప మనసు.. సర్ఫరాజ్ తండ్రికి సర్ “ప్రైజ్”

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. మన దేశంలోనే గొప్ప గొప్ప కార్పొరేట్ అధిపతుల్లో ముందు వరుసలో ఉండే వ్యక్తి. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ డౌన్ టు ఎర్త్ లాగా ఉంటారు. లక్షల మంది ఉద్యోగులకు యజమాని అయినప్పటికీ ఆ దర్పాన్ని ప్రదర్శించరు. సమాజ హితాన్ని కోరే కార్యక్రమాలను ఇష్టంగా చేపడుతుంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఆనంద్ మహీంద్రా కార్పొరేట్ ప్రపంచంలో భిన్నమైన కార్పొరేట్ అయ్యారు. కేవలం కంపెనీలు, వ్యాపారాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ అత్యంత చురుకుగా ఉంటారు.. ఊపిరి తీసుకునేందుకు కూడా సమయం లేకపోయినప్పటికీ ఆయనకు వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంటారు. సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి.. తనకు ఆసక్తి కలిగించిన విషయాల గురించి.. తాను తెలుసుకోవాల్సిన అంశాల గురించి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. అలాంటి ముక్కు సూటితనమే ఆయనను సోషల్ మీడియాలో హీరోని చేసింది. ట్విట్టర్ ఎక్స్ లో ఆనంద్ మహీంద్రాను సుమారు రెండు కోట్ల మంది అనుసరిస్తున్నారు అంటే మామూలు విషయం కాదు.

ముందుగానే చెప్పినట్టు సమాజ హితాన్ని కోరే వ్యక్తులకు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులకు, మువ్వన్నెల పతాకాన్ని ప్రపంచ వేదిక మీద రెపరెపలాడించిన క్రీడాకారులకు ఆయన తనవంతు సత్కారం చేస్తూ ఉంటారు. ఊహించని బహుమతులు అందించి ఆనందింపజేస్తుంటారు. అలా ఆయన ఊహించని బహుమతులు ఇచ్చిన వారి జాబితాలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో వ్యక్తి పేరు వచ్చి చేరింది. అతడి పేరే నౌషద్ ఖాన్.. ఒకప్పుడు రంజి ప్లేయర్ గా నౌషద్ ఖాన్ రాణించారు. కానీ దురదృష్టవశాత్తు టీమిండియాకు ఎంపిక కాలేకపోయారు. అయినప్పటికీ క్రికెట్ పై మక్కువను చంపుకోక తన ఇద్దరు కొడుకులు సర్ఫరాజ్, ముషీర్ కు తానే స్వయంగా శిక్షణ ఇచ్చాడు. ముషీర్ ఇటీవల జరిగిన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున దక్షిణాఫ్రికాలో ఆడాడు. ఇక పెద్దకొడుకు సర్ఫరాజ్ ఐపీఎల్ లో అదరగొడుతున్నప్పటికీ.. టీమిండియాలో స్థానం కోసం రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. అయితే గురువారం నుంచి ఇంగ్లాండ్ జట్టుతో మొదలైన మూడవ టెస్టులో అతడికి అవకాశం లభించింది. దీంతో నౌషద్ ఖాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమిండియా ఒకప్పటి దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే సర్ఫ రాజ్ కు బీసీసీఐ క్యాప్ ఇస్తుండగా నౌషద్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. కాగా ఈ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతోంది.

అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించాడు. తన ఇద్దరు కొడుకులను గొప్ప క్రీడాకారులుగా తయారు చేసేందుకు నౌషద్ ఖాన్ పడ్డ కష్టాన్ని తెలుసుకున్నాడు. వెంటనే అతడి క్రీడా స్ఫూర్తిగా మహేంద్ర థార్ వాహనాన్ని బహుమతిగా ప్రకటించాడు. త్వరలో అతడికి ఆనంద్ మహీంద్రా ఈ వాహనాన్ని ఇవ్వనున్నాడు. “నౌషద్ గురించి తెలుసుకున్నాను. అతడు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన తండ్రి. తన పిల్లలకు క్రికెట్లో శిక్షణ ఇచ్చి గొప్ప క్రీడాకారులుగా తయారు చేశాడు. పిల్లలపై ఏ మాత్రం విశ్వాసం కోల్పోకుండా నిరంతర శ్రమ, ధైర్యం, సహనం వంటి లక్షణాలతో వారిని ముందుకు నడిపాడు. ఒక గొప్ప తండ్రిలో ఇంతకుమించి లక్షణాలు ఏముంటాయి? అందుకే అతడికి థార్ వాహనాన్ని కానుకగా ఇవ్వాలనుకుంటున్నానని” ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించి సర్ఫ రాజ్ మైదానంలో చేస్తున్న కసరత్తు, అతని తండ్రి భావోద్వేగాన్ని వీడియో రూపంలో ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా ఆనంద్ మహీంద్రా తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేయాలంటే గొప్ప మనసు ఉండాలని నెటిజన్లు ఆనంద్ మహీంద్రా కు కితాబిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular