Vallabhaneni Vamsi:గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులో ఆయన జైలు పాలయ్యారు. కొద్దిరోజులు విచారణ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో బయటికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. గన్నవరం అసెంబ్లీ ఇన్చార్జి పదవిలో ఆయన కొనసాగుతున్నారా? లేదా? అనే విషయం మీద క్లారిటీ లేదు. గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జి ను నియమించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావడానికి ఇంకా సమయం పడుతుంది ..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలవడానికి ఒక కారణం ఉంది. ఈయన కేసులను సత్య శ్రీ అనే లాయర్ వాదిస్తున్నారు. అయితే ఆమె కోసం పోలీసులతో ఇప్పుడు వంశీ పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి సత్యశ్రికి ప్రత్యక్షంగా రాజకీయాలలో ఎటువంటి సంబంధం లేదు అయితే వల్లభనేని వంశీ కేసులు ఆమె వాదిస్తున్న నేపథ్యంలో.. ఆమెను పోలీసులు ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నట్టు వంశీ ఆరోపిస్తున్నారు. సత్య శ్రీ కి సంబంధించిన సివిల్ వివాదంలో పోలీసులు అతిగా జోక్యం చేసుకుంటున్నారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని వల్లభనేని వంశీ ఏకంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును కలిసి.. ఫిర్యాదు చేశారు. పైగా ఆయన విజయవాడ సెంట్రల్ ఏసిపి దామోదర్ మీద ఫిర్యాదు చేయడం గమనార్హం
రాజశేఖర్ బాబును కలిసిన అనంతరం వంశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అసలు వివాదాన్ని వెల్లడించారు. ” ఐదు సంవత్సరాల క్రితం విజయవాడ పరిధిలో సత్య శ్రీ ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. పక్కింటి వారితో ఒక వివాదం ఆమెకు ఏర్పడింది. ఈ వివాదంలో ఏసీపీ దామోదర్ ఎంట్రీ ఇచ్చారు. కావాలని క్రిమినల్ కేసుగా మార్చారు. స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు.. ఇతర వ్యవహారాలలో వచ్చిన తేడాలను అడ్డం పెట్టుకొని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మెప్పు పొందడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాదు ప్రైవేట్ వ్యక్తుల కోసం అక్రమ కేసులు పెడుతున్నారు. సత్య శ్రీ ఆఫీసు.. ఆమె కార్యాలయంలో కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి పోలీసులు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిఘా పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నా తరఫున కేసులను వాదిస్తున్న న్యాయవాదిని ఇలా ఇబ్బంది పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. కేసుల పేరుతో ఒక న్యాయవాదిని భయభ్రాంతులకు గురి చేయడం.. ఆమె తరఫున ఎవరు కూడా వకాల్తా తీసుకోకుండా అడ్డుకునే కుట్ర ఇందులో కనిపిస్తోందని” వంశీ వివరించారు.
చాలా రోజుల తర్వాత వంశీ మీడియా ముందుకు రావడం.. అన్నిటికంటే ముఖ్యంగా ఒక లేడీ లాయర్ కోసం ఏకంగా విజయవాడ సి పి తో మాట్లాడటం సంచలనంగా మారింది. వంశీకి సంబంధించిన కొన్ని కేసులను ఆ లేడీ లాయర్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె సమస్యలో ఇరుక్కుపోవడంతో వంశీ నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడ సి పి కి కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై విజయవాడ సిపి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ పరిణామం ఏపీ రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీస్తోంది. పార్టీ నాయకులు కేసుల పాలైనప్పుడు.. జైలుకు వెళ్లి ఇబ్బంది పడుతున్నప్పుడు బయటికి వెళ్ళని వల్లభనేని వంశీ.. ఇప్పుడు ఒక లేడీ లాయర్ కోసం బయటికి రావడం రకరకాల చర్చలకు కారణమవుతోంది.