Hyderabad Land Prices 2026: అప్పట్లో కోకాపేట ప్రాంతంలో భూములను వేలం వేసినప్పుడు ఎకరం 100 కోట్లు పోయింది. గత ఏడాది రాయదుర్గం ప్రాంతంలో ఎకరం భూమి ధర 100 కోట్లకు మించిపోయింది. దీంతో యావత్ దేశం మొత్తం మన వైపు ఆశ్చర్యంగా చూసింది. ముంబై.. చెన్నై.. కోల్కతా.. పూణే వంటి మెట్రో నగరాలలో కూడా ఈ స్థాయిలో ధరలు లేవు. కానీ హైదరాబాదులో మాత్రం అంతకుమించి అనే స్థాయిలో భూములకు ధరలు పలికి.. సరికొత్త రికార్డులు నమోదవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
హైదరాబాద్ నగరంలో టీజీఐఐసి భూముల వేలం నిర్వహించింది. రాయదుర్గం ప్రాంతంలోని పాన్ మక్తా ఏరియాలోని సర్వేనెంబర్ 83/1 లో ఆరు ఎకరాల 29 గుంటల భూమికి వేలం వేస్తున్నారు.. ఎకరం భూమిని 237 కోట్లకు ఓ కంపెనీ కొనుగోలు చేసింది. ఇంకా ఈ భూమికి సంబంధించి వేలం జరుగుతున్న నేపథ్యంలో భారీగా సొమ్ములు ప్రభుత్వానికి సమకూరే అవకాశం కనిపిస్తోంది.
గత ఏడాది ఇదే ప్రాంతంలో 7.6 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. అప్పుడు ఎకరం ధర 177 కోట్లు పలికింది. నాడు ప్రభుత్వానికి ఏకంగా 1357.59 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ధర పలకడం విశేషం. హైదరాబాద్ నగరంలో పెద్దపెద్ద కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు సాగిస్తున్నాయి. భారీగా భవనాలను నిర్మిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం.. మంచిరేవుల.. నార్సింగి.. కోకాపేట.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. నేక్నాం పుర వంటి ఏరియాలలో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ ఎకరం ధర 100 కోట్లలో ఉంది. అందువల్లే ఇక్కడ భారీగా భవనాలను నిర్మించడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తిని చూపిస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస సముదాయాలు ఏర్పాటు కావడం.. ఐటీ కంపెనీలు
.. ఫార్మా కంపెనీలు.. ఫైనాన్షియల్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నారు. అందువల్లే ఇక్కడ నివాస సముదాయాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫలితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ భూములను కొనుగోలు చేసి భారీ స్థాయిలో భవనాలను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రాజ్ పుష్ప.. అపర్ణ.. మై హోమ్.. జనప్రియ వంటి కంపెనీలు అత్యంత భారీగా నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ భూములను వందల కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక ఎకరం వచ్చేసి 237 కోట్లు పలికిందంటే మామూలు విషయం కాదు. దీంతో యావత్ దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోంది. కాగా, ధరలు ఈ స్థాయిలో పెరిగితే హైదరాబాదులో సామాన్యులు జాగాలు కొనే పరిస్థితి ఉండదని.. నిపుణులు చెబుతున్నారు.
