Kumari Aunty: అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే కాబోలు.. తమ సమస్యను ఎక్కడ పరిష్కరించుకోవాలో తెలియని నిరుద్యోగులు.. రోడ్డుమీద ఫుడ్ బిజినెస్ చేస్తూ పొట్ట పోసుకునే కుమారి అంటీని చుట్టు ముట్టారు. అదేంటి వారి సమస్యకు ఆమెను చుట్టుముట్టడం ఏంటి? అని అనుకుంటున్నారా.. ఆమెను చుట్టుముడితే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? అని అంటారా.. కానీ ఈ మాత్రం సోయి ఆ నిరుద్యోగులకు లేదు. ఒక గొర్రె పోయి బావిలో పడితే.. మిగతా గొర్రెలు దానినే అనుసరించినట్టు.. నిరుద్యోగులు కూడా ఇదే విధానాన్ని అవలంబించి అభాసుపాలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో కుమారి ఆంటీ అనే ఓ మహిళ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో సంవత్సరాల క్రితం ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించినప్పటికీ సోషల్ మీడియా వల్ల ఇటీవల పాపులర్ అయింది. సహజంగానే ఆమె ఫుడ్ స్టాల్ వద్ద గిరాకీ పెరిగింది. మాదాపూర్ ప్రాంతం కావడం.. అందులోనూ ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఫుడ్ స్టాల్ ను ఎత్తేశారు. దీంతో ఈ విషయాన్ని మీడియా బాగా హైలెట్ చేసింది. ఈ పంచాయతీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లింది. ఆమె ఫుడ్ స్టాల్ అలాగే ఉంచాలని.. వ్యాపారానికి ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు. అంతేకాదు వీలు చూసుకుని కుమారి ఆంటీ దగ్గరికి వస్తానని ప్రకటించారు. ఇదే విషయం నిరుద్యోగులకు ఆయాచిత వరం లాగా మారింది.
ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నుంచి ఆ ప్రకటన వచ్చిందో వెంటనే నిరుద్యోగులు కుమారి ఆంటీ నిర్వహించే ఫుడ్ స్టాల్ వద్దకు చేరుకున్నారు. చేతిలో ఫ్ల కార్డులు, వినతి పత్రాలతో ఆమెను చుట్టుముట్టారు. జీవో 56 వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని, మా సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆమెను కోరారు. ఒకేసారి వందల మంది నిరుద్యోగులు రావడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.. “మీ విషయం నేను ఎలా చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఇక్కడికి వస్తే ఆయనకు వినతిపత్రాలు ఇవ్వండి. అసలు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారని విషయం మీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆయన ఎప్పుడు వస్తారో కూడా నాకు సమాచారం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని” అని కుమారి ఆంటీ వారికి బదులిచ్చింది. అయినప్పటికీ ఆ నిరుద్యోగులు ఆమెను వదిలిపెట్టలేదు. అలాగే ఆమెను బతిమిలాడుతుండడంతో కుమారి ఆంటీకి చిరాకు వచ్చింది. ఇక కొంతమంది ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగుల నిరసన!
రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగుల నిరసన.#KumariAunty #RevanthReddy pic.twitter.com/kH6zcgCic9
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2024