Omkareshwara Temple on Musi River: మూసి ప్రక్షాళన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. గులాబీ పార్టీ ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ.. కొంతమంది కేసులు వేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా మూసి ప్రక్షాళన విషయంలో రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే శివతాండవం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
శనివారం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మంచిరేవుల ప్రాంతం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి విక్రమార్క.. ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కేవలం ఆలయం మాత్రమే కాకుండా.. మసీద్, గురు ప్రబంధ ను నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సిక్కుమతస్తులు అధికంగా ఉన్నారు. అందువల్లే వారికోసం గురు ప్రబంధను నిర్మించబోతున్నట్టు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉందని.. వారందరని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇవే ఆలయ విశిష్టతలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని 8 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. దీనికోసం 700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ఆలయ నిర్మాణాన్ని మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ మాదిరిగా దాదాపు 100 అడుగుల గాలిగోపురాన్ని ప్రభుత్వం నిర్మించబోతున్నది. మూసీ నదిని శుద్ధి చేసి.. అందులో గోదావరి జలాలు నింపి.. ఒక దీవిని నిర్మించబోతోంది. ఈ దీవి మధ్యలో 100 అడుగుల ఎత్తులో శివుడి విగ్రహాన్ని నిర్మించనుంది.
ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎంవో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని అందులో పేర్కొంది. ఆ వీడియోలో ఆలయ నమూనా.. గాలిగోపురం.. చుట్టూ ప్రాకారాలు.. అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రధాన ద్వారం.. అనుబంధ ఆలయాలు.. గర్భగుడి.. ధ్వజస్తంభం.. ఆలయ విశిష్టతను తెలిపే చారిత్రక ఆధారాలు.. అందులో పొందుపరచనున్నారు. అయితే, ఈ ఆలయాన్ని అరుణాచలం మాదిరిగా నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఆర్కిటెక్ట్ లు అనేక ప్రాంతాలు తిరిగారు. ప్రసిద్ధమైన శివాలయాలను సందర్శించారు. చివరికి ఈ నమూనాను ఓకే చేసినట్టు తెలుస్తోంది..